Idream media
Idream media
ఆ రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం, సంరక్షణ కోసం నిరంతరం ఆలోచించేవాడే నిజమైన నాయకుడు. ఆ కోవకు చెందిన వ్యక్తుల్లో ఏపీ సీఎం జగన్ ముందు వరుసలో ఉంటున్నారు. ప్రజా శ్రేయస్సుకే ప్రధాన ప్రాధాన్యం.. మిగతావన్నీ ఆ తర్వాతే అన్నట్లుగా జగన్ తీరు ఉంది. విపక్షాల విమర్శలు, రాజకీయాలపై ఎక్కువగా స్పందిస్తూ కాలయాపన చేయకుండా.. విపత్కర పరిస్థితుల్లో ముందు ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు చూపడంపైనే ఆయన దృష్టి సారిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతున్నప్పటికీ అక్కడి గెలుపు కోసం చేపట్టాల్సిన వ్యూహాలను, తీసుకోవాల్సిన నిర్ణయాలపై దిశా నిర్దేశం చేస్తూ మంత్రులకు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించిన జగన్ తాను మాత్రం కరోనా కాలంలో ప్రజలకు కోసం చేపట్టాల్సిన చర్యలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ నెల 14న తిరుపతి లో ప్రచారానికి హాజరుకాల్సి ఉండి కూడా ఇటువంటి పరిస్థితుల్లో జనం మధ్యకు వెళ్లి వారిని ఇబ్బందులు పెట్టడం ఇష్టం లేక విరమించుకున్నారు. తన అభిమతాన్ని లేఖల ద్వారా ప్రజలకు తెలిపి తీర్పు వాళ్ల ఇష్టానికే వదిలేశారు. తాను మాత్రం కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వేగవంతానికి కృషి చేస్తున్నారు.
వారంలో రెండు సార్లు ప్రధానికి లేఖలు
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు చేయాల్సిన పనులను వేగవంతం చేస్తున్న జగన్.. కేంద్రం నుంచి అందాల్సిన సహాయంపై కూడా ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నారు. కరోనా మహమ్మారి నివారణకు ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడం ఒక్కటే మార్గమని భావించి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఒకే రోజు 6,28,961 మందికి వ్యాక్సిన్ వేసి దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ముందంజలో ఉండి అందరి దృష్టీ ఆకర్షించారు. అలాగే ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవ్ ను విజయవంతంగా జరిపి ఆ నాలుగు రోజుల్లోనే 24 లక్షల మందికి వ్యాక్సిన్ వేయించారు. దానికి ముందుగానే ఈ నెల 9న కేంద్రానికి లేఖ రాసిన జగన్.. కావాల్సిన డోస్ లను తెప్పించుకోవడంలో విజయం సాధించారు. జగన్ లేఖ కు స్పందించిన కేంద్రం వెంటనే 6.4 లక్షల డోసులను ఏపీకి పంపించింది.
ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ను నిశితంగా పరిశీలిస్తున్న జగన్ కార్యాచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు యంత్రాంగానికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో 45 ఏళ్ల వయసు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇవ్వడానికి 60 లక్షల డోసులు పంపించాలని ఈ నెల 16న మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా వచ్చే మూడు వారాల్లో 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని, ఇందుకు 60 లక్షల టీకా డోసులు పంపించేలా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించాల్సిందిగా కోరారు.
మూడు వారాల్లో…
టీకా ఉత్సవ్లో భాగంగా ఏప్రిల్ 14న దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకేరోజు 6,28,961 మందికి వ్యాక్సిన్ ఇచ్చిన ఏపీ వచ్చే మూడు వారాల్లో 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ తొలి డోసు టీకా ఇచ్చేందుకు సన్నద్ధమైంది. పీహెచ్సీ ఉన్న గ్రామ, వార్డు పరిధిల్లో అర్హత ఉన్న వారికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసింది. సంతృప్తస్థాయిలో టీకాలు ఇచ్చేవిధంగా కేవలం జిల్లా అధికార యంత్రాగానికే పరిమితం కాకుండా టీకా ఉత్సవ్ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా టీకాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. రోజుకు 6 లక్షల మందికి టీకాలు ఇచ్చే శక్తి సామర్థ్యాలు సొంతం చేసుకోవడమే కాకుండా ఈ విధానాన్ని దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే విధంగా చేస్తోంది. ఈ డ్రైవ్ లో వ్యాక్సిన్ కొరత రాకుండా ఉండేందుకు ఏపీకి 60 లక్షల టీకా డోసులు పంపించాలని కేంద్రానికి జగన్ లేఖ రాశారు. దేశంలో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి హామీ ఇచ్చారు.
ఇలా పరిస్థితులకు తగ్గట్టుగా ఏపీ సీఎం జగన్ ప్రజల సంరక్షణ, సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. రాజకీయాలే పరమావధిగా, అధికారమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ కుట్రలు పన్నుతుంటే.. జగన్ మాత్రం మనం చేసే పనులే మనకు అన్నీ ఇస్తాయని నమ్ముతూ ముందుకు సాగుతూ రాజకీయ నాయకుల్లో కొత్త తరహా ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. కరోనా మొదటి దశలో ప్రజల్ని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఆదుకున్న జగన్.. రెండో దశలో కరోనా కారణంగా వాతావరణం సీరియస్ గా మారకుండా ప్రతి ఒక్కరికీ టీకా ఇప్పిస్తూ అడ్డుకట్ట వేసేందుకు చిత్తశుధ్దితో కృషి చేస్తున్నారు.