Idream media
Idream media
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచిస్తున్నారనే విషయం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను బట్టి అర్థమవుతోంది. అందరి రాజకీయ నాయకుల్లా ఆర్భాటంగా ప్రకటనలు చేసేయడం, తప్పుడు లెక్కలు చూపించడం, మసిపూసి మారేడుకాయ చందంగా మాట్లాడడం చేయకుండా సూటిగా, పక్కాగా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపోయేలా పనులు చేసుకుంటూ పోతున్నారు. ఒకే రోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని సంకల్పించి, లక్ష్యం కంటే అధికంగా అంటే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ అందించి అందరినీ అబ్బురపరిచారు. రికార్డులు సృష్టించడం, ప్రజా ఆరోగ్య, ఆర్థిక సంబంధిత విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారని మరోసారి రుజువు చేసుకున్నారు.
వ్యాక్సినేషన్ లోనే కాదు.. జగన్ అన్ని విషయాలలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్న వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కరోనా సంక్షోభం ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి తక్షణం స్పందించి వైద్య, ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. అధికారులతో తీసుకోవాల్సిన చర్యలపై నిత్యం స్వయంగా సమీక్షలు నిర్వహించారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి, వైరస్ బారిన పడిన వారిని తక్షణం గుర్తించడానికి ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యలు కరోనాను కట్టడి చేయడానికి ఉపకరించాయి.
క్షేత్రస్థాయిలోకి పాలనను చేరువ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన పాలనాపరమైన మార్పులు కూడా సంక్షోభ సమయంలో ప్రజలకు సత్వర సేవలందించేందుకు కారణమయ్యాయి. ప్రతి రెండువేల జనాభాకు ఒక గ్రామ, వార్డు సచివాలయంను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సచివాలయాల పరిధిలో ఫీవర్ క్లీనిక్స్ను ప్రారంభించిన ప్రభుత్వం కరోనా విపత్తులో ఇంటింటి సర్వేలను విజయవంతంగా నిర్వహించింది. కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వేలు నిర్వహించారు. ఫీవర్ సర్వే అనేది నిరంతరం జరిగే ప్రక్రియగా తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేంది లేదని పలుసార్లు సీఎం అధికారులను హెచ్చరించారు.
రెండో వేవ్ కరోనా సమయంలో వైద్యపరంగా వైరస్ కట్టడికి అనుసరించాల్సిన విధానాలపై శాస్త్రీయంగా వచ్చిన అన్ని విధానాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. మొదటి వేవ్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 సార్లు ఫీవర్ సర్వే నిర్వహిస్తే, రెండో వేవ్ సమయంలో 8 సార్లు రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. అంతేకాదు కరోనా తగ్గుతోందనే ఉదాసీనత పనికిరాదని, తమకు వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నాయన్న ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సచివాలయ స్థాయిలో ఏర్పాటైన ఫీవర్ క్లీనిక్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది ఆశా వర్కర్లు, 19 వేల మంది ఎఎన్ఎంలు, దాదాపు 2.66 లక్షల మంది వాలంటీర్లు ఈ ఫీవర్ సర్వే నిర్వహించారు.
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. అంతేకాకుండా ఫీవర్ సర్వే వల్ల ప్రజల్లో తమ ఆరోగ్యం పట్ల చైతన్యాన్ని కలిగించారు. కోవిడ్ వైరస్ ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు, వైద్య సహాయం కోసం అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహనను కల్పించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని సమర్థంగా అమలు చేయడం వల్ల కోవిడ్ వంటి విపత్కర పరిస్థితిని కూడా ప్రభుత్వం సవాల్గా తీసుకుని మరీ ఎదుర్కొంది.