iDreamPost
iDreamPost
చిరు ధాన్యాల పంటలకూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని, సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ, ఉద్యాన శాఖలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షా కేంద్రాలు, వర్క్షాపులు, నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు అందుబాటులో ఉండాలన్నారు. త్వరలో చిరుధాన్యాల బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. సేంద్రీయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చూడాలని సూచించారు.
అరటి చెట్లు పడిపోతే రైతులకు బీమా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి విషయాల్లో ప్రకృతి వైపరీత్యాల నిధితో అండగా నిలవాలన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలను వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు సీఎం తెలిపారు. తుపాన్లు, పెను గాలులను దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ల డిజైన్లు రూపొందాలని సీఎం ఆదేశించారు.
విత్తనాలు ఉత్పత్తి చేసే రైతుల నుంచి ఏపీ సీడ్స్ నేరుగా కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. సాగులో మెళకువల కోసం వైఎస్సార్ పొలం బడి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని పంటలను ఇ–క్రాప్ విధానంలో నమోదు చేయాలన్నారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు ట్యాబ్లు లేదా సెల్ఫోన్లు ఇవ్వనున్నామని తెలిపారు. మరో 2 వేల గ్రామాల్లో వాతావరణ పరిశీలనా కేంద్రాలు, ప్రతి గ్రామంలో భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వర్క్షాపులో రైతులకు సలహాలు, సూచనలు, శిక్షణ ఇవ్వాలని సూచించారు. విత్తనాల కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం మొదలు రైతులకు అందించే వరకూ ప్రతి ప్రక్రియ పారదర్శకంగా, ఉత్తమ ప్రమాణాలతో జరగాలన్నారు. చంద్రబాబు లాంటి మనుషులు అదే పనిగా వేలెత్తి చూపించడానికి ప్రయతి్నస్తారని, ఏదైనా మంచి పని జరుగుతుందంటే చూసి ఓర్వలేరని అన్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతా అవినీతి అని, అంతా అన్యాయం జరిగిపోయిందని.. ఇలా నానా రకాలుగా మాట్లాడి విష ప్రచారం చేస్తారని, అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.