Idream media
Idream media
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మరోసారి సవాల్ కు తెరతీశారు. సమావేశాలు, ఆందోళనలు జరిగినప్పుడు అక్కడి జనాలను చూసి రాజకీయ నాయకులు ఆవేశంగా మాట్లాడడం, హామీలు ఇవ్వడం మామూలే. అయితే ఈ సారి చంద్రబాబు కాస్త ఎక్కువ ఆవేశమే చూపించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. ఇంతకీ ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది..? గతంలో కూడా ఆయన విసిరిన సవాళ్లు ఏమయ్యాయి…? సవాల్ కు సిద్ధమైతే నిజంగా తెలుగుదేశానికి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఆదరణ ఉంటుందా..? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అమరావతి రాజధాని ఉద్యమానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా అమరావతి జేఏసి ఆధ్వర్యంలో జనభేరి సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ నేత చంద్రబాబు వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉంటుంది అని సీఎం జగన్ చెప్పాలి లేదా జగన్ రెఫరెండంకు సిద్ధం కావాలన్నారు. 45 రోజుల్లో ఎవరి ప్రచారం వారు చేసుకుందాం, జగన్ గెలిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని చంద్రబాబు సవాల్ విసిరారు. తాను అధికారం కోసం పోరాటం చేయడం లేదని, తనకు అదికారం కొత్తకాదని అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ జరుగుతున్నదంతా వాస్తవం కాదని చెప్పారు. మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందని లితే.. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆఫర్ కూడా ఇచ్చారు.
గతంలో కూడా…
చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఇంతకంటే ఎక్కువ ఆవేశంగానే 48 గంటల్లో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయగలరా.? అంటూ సవాల్ విసిరారు. ‘ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలకు వెళదాం.. మూడు రాజధానులపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది..’ అంటూ చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన ప్రెస్మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులకోమారు సమావేశాలు పెట్టి ప్రజలకు నిజాలు తెలియజేస్తానని కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు అసెంబ్లీని రద్దు చేయమనడం హాస్యాస్పదంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ చర్యలు నచ్చకపోయినా.., ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని భావించానా ప్రతిపక్ష నేతలు నిరసనలు తెలపడమో.. మరీ తీవ్రంగా ఉంటే రాజీనామాల ప్రతిపాదన చేస్తారు. అలా కాకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని రాజీనామా చేయమనడం విచిత్రం అనిపించింది. నాటి చంద్రబాబు సవాల్ కు సొంత పార్టీ ఎమ్మెల్యే లే ముందుకు రాని పరిస్థితి కనిపించింది. చంద్రబాబు చేసిన రాజీనామా సవాల్ కు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ ముందుకు రాలేదు. పైగా ఆ సవాల్ అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలిపారు. చంద్రబాబు నిర్ణయాల కారణంగా తాము రాజీనామాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు.
ఇప్పుడు రిఫరెండం పేరుతో చంద్రబాబు మరోసారి వార్తల్లో నిలిచే ప్రయత్నం చేశారు. అమరావతి విషయంలో చంద్రబాబు తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు ‘బస్తీ మే సవాల్’ అంటున్నారని ఆరపణలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు ప్రజలు అనుకూలంగానే ఉన్నట్లు విశాఖ, కర్నూలు సహా అమరావతిలో చోటుచేసుకున్న సంఘటనే నిదర్శనంగా నిలుస్తున్నాయి. చంద్రబాబు మొదలెట్టిన అమరావతి ఉద్యమానికి నిరసనగా అమరావతి పరిసర ప్రాంతానికి చెందిన ఓ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అభివృద్ధి వికేంద్రరణకు మద్దతుగా అమరావతిలోనే ఉద్యమం నడుస్తోంది. మరోవైపు విశాఖలో కూడా విశాఖ మన అందరిదీ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరించడంటూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ మూడు రాజధానులకు ప్రజలు అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిఫరెండంపై చంద్రబాబు ఎంత వరకూ నిలబడతారో చూడాలి.