Idream media
Idream media
కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. నేటి సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య కొత్తమంత్రులు రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందన్న విషయంపై ఉదయం వరకు కూడా ఉత్కంఠ అలానే కొనసాగింది. ఆశావాహులు మాత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రమే చాలా మంది హస్తినకు వచ్చేశారు.
ఆరుగురికి కేబినెట్ పదవులు దక్కే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింథియా, అసోం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీలకు..మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇక దిలీప్ ఘోష్, నాంగ్యాల్, మనోజ్ తివారీకి చోటు దక్కే అవకాశముంది. ఎల్జేపీలో తిరుగుబావుటా ఎగురవేసిన పశుపతి పరాస్,అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్ తదితరులకు కేబినెట్ బెర్త్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.
యువత, ఉన్నత విద్యావంతులకు విస్తరణలో పెద్దపీట వేయాలని ప్రధాని నిర్ణయించారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు కూడా ప్రాథాన్యత లభించబోతోంది. ముఖ్యంగా యూపీకి ఎక్కువ పదవులు దక్కే అవకాశం ఉంది. మిత్రపక్షాల విషయానికొస్తే జేడియూకు కచ్చితంగా అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. తమకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని బీహార్ సీఎం నితీష్కుమార్ ప్రధాని మోదీని కోరినట్టు తెలుస్తోంది. 2019లో మోదీ రెండో విడత ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకూ మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు.
నిబంధనల ప్రకారం..కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్లో 53 మంది మాత్రమే ఉన్నారు. చాలా మంత్రుల వద్ద ఒకటికంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలున్నాయి. దీంతో మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టారు ప్రధాని మోది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే అసోం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా , నారాయణ్ రాణే ఢిల్లీకి చేరుకున్నారు. మోదీ కేబినెట్లో యువతకు గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ప్రాతినిధ్యం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఓబీసీలకు కూడా పెద్దపీట వేస్తారని చెబుతున్నారు.
ఢిల్లీకి చేరే ముందు జ్యోతిరాదిత్య సింధియా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో బాటు జనతా దళ్ నేత ఆర్ సి పీ సింగ్ కూడా ఉదయం హస్తిన చేరుకున్నారు. అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, బీహార్ లో లోక్ జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ నుంచి పార్టీని ‘లాగేసుకుని తననే నేతగా ప్రకటించుకున్న ఆయన ‘అంకుల్’..పశుపతి కుమార్ పరాస్, మంగళవారం మధ్యాహ్నం విమానమెక్కారు. ఇంకా దినేష్ త్రివేదీ, జితిన్ ప్రసాద, అప్నా దళ్ నేత అనుప్రియ పటేల్, పంకజ్ చౌదరి, రీటా బహుగుణ, వరుణ్ గాంధీ, రాహుల్ కాశ్వాన్, తదితరులంతా పోస్టుల కోసం ‘క్యూ’లో ఉన్నారు.