చంద్రబాబు గురువారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలవారు రావాల్సిందిగా చంద్రబాబు పిలుపునిచ్చారు. కాగా ఈ సమావేశానికి బీజేపీ,సీపీఎం పార్టీలు గైర్హాజరు కావడం చర్చనీయాంశం అయ్యింది .
ఇదివరకే చంద్రబాబును నమ్మి మోసపోయామని మరోసారి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేమని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. బీజేపీతో కలవడానికే చంద్రబాబు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసారనే అభిప్రాయం వ్యక్తం చేసారు. బీజేపీ పార్టీ టీడీపీ కి తోక పార్టీగా ఉండబోదని బీజేపీ నాయకులు స్పష్టం చేసారు. తమ పార్టీ సొంతంగానే ఉద్యమాలు చేస్తుందని తెలిపారు.
సిపిఎం పార్టీ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. చంద్రబాబు ఇప్పటికే రాజధాని రైతులను, రైతు కూలీలను మోసం చేసాడని సిపిఎం నేతలు వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు ఏర్పాటు చేసిన అఖిలపక్షా సమావేశానికి హాజరు కాలేదని పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణే తమ లక్ష్యమని సిపిఎం నాయకులు పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒక్క అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహించని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత అన్ని పార్టీలను కలుపుకుని పనిచేయాలని అనుకోవడం వెనుక వ్యక్తిగత స్వార్థం తప్ప వేరే ఉద్దేశ్యం ఏదీ లేదన్నది రాజకీయ నిపుణుల మాట. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పార్టీని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఇతర పార్టీల మద్దతుకోసం ఆరాటపడుతున్నాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
చంద్రబాబు గతంలో చేసిన పొరపాట్లే అయన పాలిట శాపంగా మారాయని రాజకీయ వర్గాల్లో వినబడుతున్న మాట. దీనితో అన్ని పార్టీలను కలుపుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు ఆదిలోనే హంసపాదుల రెండు ప్రధాన పార్టీలు హాజరు కాకుండా మొండిచెయ్యి చూపడం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది.