iDreamPost
android-app
ios-app

మమతా ఎమ్మెల్యే అవుతారా?సీఎం పదవి నిలుపుకుంటారా ?

మమతా ఎమ్మెల్యే అవుతారా?సీఎం పదవి నిలుపుకుంటారా ?

పశ్చిమబెంగాల్ రాజకీయాలు మరోసారి కాక పుట్టిస్తున్నాయి. ఈసారి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికై, ముఖ్యమంత్రి పీఠం దక్కించుకుంటారా రాలేదా అన్న దానిమీద రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ను ఆసక్తి నెలకొంది. మమత ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్రాన్ని పరిపాలించాలి అంటే పశ్చిమబెంగాల్లో ఉప ఎన్నికలు ఒక్కటే శరణ్యం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది… బిజెపి ఎలాంటి రాజకీయ గేమ్ మొదలుపెడుతుంది అన్నది కూడా ఆసక్తిగా మారింది.

పశ్చిమ బెంగాల్ లో తృణముల్ అద్భుతమైన విజయం తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీకి వింత సమస్య ఎదురవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేసి సువెందు అధికారి చేతిలో ఓడిపోయారు. గతంలో భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ, ఇటీవల ఎన్నికల్లో అనూహ్యంగా తన స్థానాన్ని మార్చుకొని నందిగ్రామ్ నుంచి పోటీ చేయడం, అక్కడ స్థానికంగా మంచి పట్టున్న సువెందు అధికారి వంటి కీలక నేత చేతిలో ఓడిపోవడంతో ఆమె కచ్చితంగా విధానసభ నుంచి ఎన్నిక కావాల్సిన అవసరం ఏర్పడింది. మమత ఓడిపోయిన అనంతరం భవానీపూర్ శాసనసభ సభ్యుడుగా ఎన్నికైన శోభన్ దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. అంటే మమత కోసం ఆయన తన స్థానాన్ని ఖాళీ చేసారు. ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

ఏ సభలోనూ సభ్యుడు కానీ వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల్లోగా ఖచ్చితంగా శాసనసభ లేదా శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో భవానీపూర్ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. సీఎం మమతాబెనర్జీ కచ్చితంగా ఆ స్థానం నుంచి పోటీచేసి శాసనసభకు వెళ్తారని ఇప్పటివరకు ఊహాగానాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి శాసనమండలి లేకపోవడంతో కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే మమత ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలుంటుంది. ఆమె ఆరు నెలల సమయం నవంబర్ నాటికి ముగుస్తుంది. అంటే ఆ లోగా కచ్చితంగా భవాని పూర్ స్థానం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఖాళీగా ఉన్న ఒకే ఒక్క స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

Also Read : ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్

ప్రస్తుతం కరోనా రెండో దశ ముగిసిపోయినా, మూడో దశ వార్తలు భయపెడుతున్నాయి. మరోపక్క కరోనా ఇతర వేరియంట్లు, డెల్టా ప్లస్ వెరియంట్ కేసులు పెరగడం కూడా ఇప్పుడు ఆందోళన రేపుతోంది. ఇలాంటి కీలక సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహించడానికి ఆసక్తి చూపించకపోతే కచ్చితంగా మమతా బెనర్జీ ఇరుకున పడినట్లే. ఇటీవల మద్రాస్ హైకోర్టు సైతం కేంద్ర ఎన్నికల సంఘం మీద తీవ్రంగా విరుచుకు పడి, కరోనా సమయంలో ఎన్నికలు, ర్యాలీలో నిర్వహణకు అనుమతి ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం మీద హత్య కేసు ఎందుకు నమోదు చేయ కూడదు చెప్పాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో మొత్తం ఈ విషయం మీద దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఇప్పుడు మూడో దశ కరోనా తీవ్రంగా ఉంటుందన్న వార్తలు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దీనిని సాకుగా చూపి పశ్చిమ బెంగాల్ లో ఉప ఎన్నికలకు సిద్ధంగా లేకపోతే మమతాబెనర్జీ రాజీనామా చేయాల్సిందే. మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతలు ఎన్నుకుని వారికి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాల్సి ఉంది.

గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత, ఆరు నెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక కాకపోతే నాయకులు మళ్లీమళ్లీ ప్రమాణ స్వీకారం చేసే వారు. దీంతో కాలం నెట్టుకొచ్చే వారు. అయితే ఆ విధానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు 1995లో ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించింది. ముఖ్యమంత్రి అభ్యర్థి కచ్చితంగా ఆరు నెలల లోపు చట్టసభల్లో ఉండేలా చూసుకోవాలని లేకుంటే కచ్చితంగా రాజీనామా చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో అప్పటి నుంచి ఆ విధానం రద్దయినట్లు అయింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు మమతా బెనర్జీ వెర్సస్ భారతీయ జనతాపార్టీ అన్నట్లుగా ఉండడంతో ఈ విషయంలో బీజేపీ నాయకులు ఎలాంటి చర్యలకు దిగుతారు మమతా బెనర్జీ వేసే అడుగులు ఏంటి?? అన్నవి కీలకంగా మారాయి. మమతా బెనర్జీ తర్వాత ఎవరు అన్న ప్రశ్న బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఉదయిస్తోంది.

మమతా బెనర్జీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా లేకపోతే అది నైతికంగా మమతా బెనర్జీ విజయం కిందే లెక్క. దీనిపై మమతా న్యాయ పోరాటం చేయడంతో పాటు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తుంది అని ఎందుకు ఈ అవకాశం మమతకు చక్కగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఆమె మరింత సింపతీ ని పొందవచ్చు. 2019 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో 18 ఎంపీ సీట్లు సాధించిన బిజెపి, మమతా బెనర్జీని అడ్డుకున్నట్లు అయితే ఖచ్చితంగా అది మమతకే ప్లస్ అవుతుంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు దీదీని కావాలనే ముఖ్యమంత్రి కానీయకుండా బిజెపి అడ్డుకుంటుందని భావిస్తారు అనడంలో సందేహం లేదు. ఇటీవల ఎన్నికల్లోనూ మమతా బెనర్జీ ఢిల్లీ నాయకులు కావాలా స్థానిక నేతలు కావాలా అన్న నినాదంతో ముందుకు వెళ్లారు. ఇప్పుడు మమతా బెనర్జీ కి అడ్డు చెబితే ఖచ్చితంగా అది బెంగాల్ లో బిజెపికి ఎదురుగాలి వీయడానికి ఒక మార్గం అయ్యే అవకాశం ఉంది.

Also Read : బాబు భ‌లే జోకులేస్తున్నారు..!