iDreamPost
android-app
ios-app

Kuppam Chandrababu -అప్పుడు మండలిలో.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు స్కెచ్ పారుతుందా

  • Published Nov 15, 2021 | 2:48 AM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
Kuppam Chandrababu -అప్పుడు మండలిలో.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు స్కెచ్ పారుతుందా

అందరికీ గుర్తుండే ఉంటుంది. జనవరి 21, 2020వ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అసెంబ్లీలో చర్చ జరిగింది. విపక్ష టీడీపీ నేతలు మాత్రం అక్కడ కిమ్మనకుండా ఊరుకున్నారు. ఆ మరునాడు శాసనమండలికి సీన్ మారింది. అక్కడ మాత్రం చెలరేగిపోయారు. దానికి మండలిలో మెజార్టీతో పాటుగా చంద్రబాబు కుయుక్తులు కూడా తోడుకావడంతో ఆ బిల్లుల ఆమోదం లేకుండా అడ్డుపుల్ల వేశారు. సెలక్ట్ కమిటీ పేరుతో నాటి చైర్మన్ షరీఫ్‌ చేసిన ప్రతిపాదన వివాదమయ్యింది. తను రిలీవ్ అయిన తర్వాత తప్పిదాన్ని అంగీకరించే స్థాయిలో ఆనాడు చైర్మన్ స్థానం వ్యవహరించింది.

అయితే దానికి ప్రధాన కారణం మండలి పోడియం నుంచి చంద్రబాబు ఆదేశాలేనన్నది బహిరంగ రహస్యం. స్వయంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి ఆ చట్టాలను రూపొందించకుండా అడ్డుకునే కుయుక్తులు పన్నారు. గ్యాలరీ నుంచి ఆయనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాటిని చైర్మన్ పాటించేలా ఒత్తిడి చేశారు. తదనుగుణంగా సామరస్యంగా సాగాల్సిన వ్యవహారాన్ని పెను దుమారంగా మార్చేశారు. ఇదంతా చంద్రబాబు వ్యూహాల ప్రకారమే జరిగింది. చట్టం కాకుండా అడ్డుకునే శక్తి లేకపోయినా చిక్కులు కల్పించాలనే ఉద్దేశంతో సెలక్ట్ కమిటీ ప్రహసనం నిబంధనలను తోసిపుచ్చి నడిపించారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లో జరిగిందన్నది కాదనలేని వాస్తవం.

కట్ చేస్తే సీన్ కుప్పం మునిసిపాలిటీకి మారింది. 2021 నవంబర్ 15కి వచ్చింది. ఈసారి కుప్పం మునిసిపాలిటీకి మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా చంద్రబాబుకి శక్తి లేదు. ప్రజల్లో బలం లేదు. గెలుస్తామనే భరోసా లేదు. మూడు దశాబ్దాలకు పైగా కుప్పం అభివృద్ధిని విస్మరించినందుకు ఆయన ఓటమి కోరల్లో ఉన్నారు. తమను నిర్లక్ష్యం చేసినందుకు గానూ స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే ఓటర్లు చెంపదెబ్బ కొట్టారు. ఇప్పుడు కనీసం కుప్పం పంచాయతీ స్థాయిని కూడా పెంచలేని చంద్రబాబు, జగన్ హయాంలో దక్కిన మునిసిపాలిటీ హోదాలో మొదటి ఎన్నికలు జరుగుతుంటే మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం ఎన్నికలు కూడా సజావుగా సాగడం ఆయనకు సుతారమూ ఇష్టం లేదన్నట్టుగా కనిపిస్తోంది. మునిసిపల్ పోలింగ్ ప్రశాంతంగా సాగడం ససేమీరా ఇష్టం లేదన్నట్టుగా కనిపిస్తోంది.

దాంతో ఆయనే మళ్లీ రంగంలో దిగుతున్నారు. ఇప్పటికే మూడు రోజుల ప్రచారం నిర్వహించారు. తనయుడు లోకేష్ తో రెండు రోజుల పాటు కుప్పం వీధులన్నీ తిప్పారు. సాధారణ ఎన్నికల్లో కూడా కుప్పం ప్రజలకు మొఖం చూపించని టీడీపీ నేతలు ఈసారి గల్లీ గల్లీలో కనిపించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన వారిని ఇన్ఛార్జులుగా నియమించి భారీగా పంపకాలు చేపట్టారు. అయినా ధీమా లేకపోవడంతో నేరుగా చంద్రబాబు రంగంలోకి వచ్చారు. దాంతో ఈ ఎన్నికలు ఏమేరకు రచ్చ చేస్తాయోననే చర్చ మొదలవుతోంది. ఎన్నికలు సజావుగా సాగితే తన ఓటమికి తగిన కారణాలు చెప్పుకోలేమనే ఉద్దేశంతో ఏదో విధంగా వివాదం సృష్టించే లక్ష్యంతోనే చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు ఆయన సొంత నియోజకవర్గం వెళుతున్నారని చెబుతున్నప్పటికీ దాని వెనుక ఆయన స్కెచ్ వేరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రజామద్ధతు సన్నగిల్లిన నేపథ్యంలో చంద్రబాబు ఎత్తులు ఫలిస్తాయా లేదా అన్నది ప్రశ్నార్థకమే.

Also Read : Municipal Elections Polling, Kuppam – నేడే మినీ పురపోరు.. కుప్పం ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది..?