iDreamPost
android-app
ios-app

పెన్నా ఉగ్ర రూపం.. కూలిన జమ్మలమడుగు బ్రిడ్జి

పెన్నా ఉగ్ర రూపం.. కూలిన జమ్మలమడుగు బ్రిడ్జి

సుమారు వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా వ్యాప్తంగా నదులు పొంగి పొర్లుతున్నాయి. పాపాఘ్ని నది పోటెత్తడంతో అంతా ఊహించిన విధంగా శనివారం అర్థరాత్రి కడప జిల్లా కమలాపురంలో నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. రెండు రోజుల పాటు వంతెన వద్ద ప్రమాదకరంగా ప్రవహించిన పాపాఘ్ని నది ఆ వంతెనను కూల్చేయగా ఇప్పుడు అదే జిల్లాలో మరో వంతెన కూలింది.

జమ్మలమడుగు వద్ద వున్న పెన్నానది బ్రిడ్జికి వరద దెబ్బ తగలడంతో నిన్నటి నుంచే బ్రిడ్జి నదిలోకి కుంగుతూ వచ్చింది. ఇక తాజా సమాచారం మేరకు ఆ బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయింది. ఇక కుంగడం మొదలైన వెంటనే జమ్మలమడుగు నుండి ముద్దనూరు, పులివెందుల, అనంతపురం, తాడిపత్రిలతో పాటు 15 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గండికోట జలాశయం నుంచి వరద ఉధృతి కొంత మేర తగ్గింది. దీంతో మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 12 గేట్ల ద్వారా 50,000 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదిలారు.

శనివారం ఉధృతంగా ప్రవహించిన పెన్నానది ఆదివారానికి కాస్త నెమ్మదించింది. కానీ మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కొనసాగుతున్నందున పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వారు హెచ్చరించినట్టుగా పెన్నా నది మీద ఉన్న ముద్దనూరు- జమ్మలమడుగు బ్రిడ్జి కూలిపోవడం గమనార్హం.