బోయపాటి శీను బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తున్నాం. ఇంకా టైటిల్ డిసైడ్ కానీ ఈ చిత్రానికి మోనార్క్ పేరు దాదాపు ఖాయమైనట్టే. కాకపోతే బాలయ్య ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఇంకో రెండు మూడు ఆప్షన్స్ చూసి ఫైనల్ చేయబోతున్నట్టు తెలిసింది. గాడ్ ఫాదర్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ పేరుతో గత కొన్నేళ్లలో ఏ మూవీ రాలేదు. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం ఏఎన్ఆర్ వినోద్ కుమార్ కాంబోలో వచ్చింది కానీ అది ఫ్లాప్ కావడంతో ఎవరికీ గుర్తు లేదు. ఈ కథకు ఇది కూడా బాగుంటుందని పలువురు యూనిట్ సభ్యులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా దీని షూటింగ్ కి చిన్న బ్రేక్ పడినట్టు సమాచారం. ప్రస్తుతం యూనిట్ వికారాబాద్ లోని కోటలగూడ గ్రామం పరిసరాల్లో కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. ఇందులో బాలయ్య కూడా పాల్గొంటున్నారు. అయితే అక్కడి రైతులు ఈ షూట్ వల్ల తమ పొలాలు దెబ్బ తింటున్నాయని అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా చిన్న బ్రేక్ ఇచ్చినట్టు వినికిడి. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కానీ ఇన్ సైడ్ నుంచి వచ్చిన న్యూస్ అయితే జోరుగా ప్రచారమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఇప్పటికే బోయపాటి టీమ్ రంగంలోకి దిగిందట. త్వరగానే రీ స్టార్ట్ అవుతుంది.
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే శ్రీకాంత్ విలనీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందట. ఐపిఎస్ ఆఫీసర్, అఘోరా, ఫ్యాక్షనిస్ట్ ఇలా మూడు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య నటిస్తున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీంద్రారెడ్డి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బిజినెస్ క్రేజీగా జరుగుతోంది. మే 28 రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అదే రోజు రవితేజ ఖిలాడీ ఉన్నప్పటికీ పోటీకి సై అనే సంకేతం ఇచ్చేశారు. వచ్చే నెల శివరాత్రి సందర్భంగా టైటిల్ తో పాటు టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో బోయపాటి ఉన్నారు.