iDreamPost
iDreamPost
బ్రిటీష్ కాలం నాటి బందరు పోర్టుకి మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి. దానికి అనుగుణంగా కెనరా బ్యాంక్ ముందుకు రావడంతో పోర్ట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం హడావిడి చేసినప్పటికీ నవయుగ సంస్థకు ప్రయోజనం కలిగించడమే తప్ప పోర్ట్ నిర్మాణ పనులకు మోక్షం దక్కలేదు. చివరకు వైఎస్ జగన్ సర్కారు కాంట్రాక్ట్ సంస్థ నవయుగ ను తొలగించి, పోర్ట్ కి మార్గం సుగమం చేసింది.
ఏపీలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రధాన వనరుగా ఉన్న సముద్ర తీరాన్ని వినియోగించుకోవడంపై దృష్టి సారించింది. వీలయినన్ని పోర్టుల నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే పునర్విభజన చట్టంలో ఉన్న పోర్టులకు క్లారిటీ వస్తుంది. మిగిలిన వాటిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించినట్టు స్పష్టం అవుతోంది. అందులో భాగంగా బందరు పోర్టుని వీలయినంత వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.
తాజాగా కెనరా బ్యాంకుతో జరిపిన చర్చల్లో రూ.4వేల కోట్లు రుణంగా ఇచ్చేందుకు ముందుకొచ్చినట్టు ఎంపీ బాలశౌరి ప్రకటించారు. దాంతో పోర్ట్ నిర్మాణం వేగవంతం అయ్యే అవకాశాలున్నాయి. తొలుత ఈ పోర్ట్ ని తెలంగాణా ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రచారం సాగినప్పటికీ చివరకు ఏపీ ప్రభుత్వమే నిర్మాణం బాధ్యతలు తీసుకోవడం, దానికి రుణం ఇవ్వడానికి కెనరా బ్యాంక్ ముందుకు రావడంతో ముహూర్తం సిద్ధం అయ్యే అవకాశం కనిపిస్తోంది.