iDreamPost
iDreamPost
ఇప్పటికప్పుడు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు కరోనాయే. కానీ భవిష్యత్తులో మనకు ఎదురుకాబోతున్న ఇంకా పెద్ద ముప్పు బయోవేస్ట్ అని నిపుణులు మొత్తుకుంటున్నారు. కరోనాను ఎదుర్కొనే ఉద్దేశంతో ఇప్పుడు మనం వినియోగించే ప్రతి వస్తువు భవిష్యత్తులో బయో వేస్టుగానే పరిగణించబడుతుంది. వీటిలో మాస్కులు, గ్లౌస్, శానిటైజర్ బాటిల్స్, ఆసుపత్రి వ్యర్ధాలు.. ఇలా అన్ని కలగలిపి ఉంటాయి.
గుడ్డతో తయారు చేసిన మాస్కులను తిరిగి వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే సర్జికల్ మాస్కులను మాత్రం యూజ్ అండ్ త్రో కేటగిరీలోనే వేయాలి. వినియోగానికి వీలుగా ఉందని వీటిని వాడేవాళ్ళంతా అవి భూమిలో కలిసేందుకు ప్లాస్టిక్తో సమానంగా సమయం పడుతుందంటే ఆశ్చర్యపోక మానరు. ప్లాస్టిక్ సంబంధిత పదార్ధాంతోనే తయారవుతున్న ఈ మాస్కు సహజ సిద్ధంగా భూమిలో కలవాలంటే కొన్ని పదులు, వందల ఏళ్ళు పట్టినా పట్టొచ్చు.
అయితే ప్రస్తుతం మన ముందు కన్పిస్తున్న ప్రమాదాల్లో కరోనా కంటే పెద్ద ముప్పు ఏమీ గుర్తించలేకపోతున్నాం. ఇదే ఆలోచనా స్థాయిలో కొనసాగితే ‘తరువాత’ పరిస్థితిని కూడా మన చెయ్యిదాటి పోతుందని పలువురు పర్యావరణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనావాసాల నుంచి వెలికివస్తున్న వేలాది టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వీటికి అదనంగా ఇప్పుడు కరోనా కారణంగా ఉత్పన్నమవుతున్న బయోవేస్ట్ కూడా తోడవుతోంది.
ప్రస్తుతం మన దేశంలో 84వేల వరకు ఆసుపత్రులు ఉంటాయని అంచనా. వీటి నుంచి ప్రతి రోజూ వచ్చే వ్యర్ధాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డిస్పోజ్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే ఆ స్థాయిలో డిస్పోజ్ చెయ్యగలిగే యూనిట్లు కలిగిన ఆసుపత్రులు కేవలం వందల్లోనే ఉంటాయంటే అశ్చర్యం కలుగక మానదు. ఇన్ని వేల ఆసుపత్రుల నుంచి ప్రతి రోజూ వచ్చే వ్యర్ధాలు ఎన్ని వందల టన్నులు ఉంటాయో అంచనా వేయొచ్చు. అయితే అవన్నీ ప్రస్తుతం డంపింగ్ యార్డులకే చేరుతున్నాయి. వీటిని శాస్త్రీయంగా డిస్పోజ్ చెయ్యకపోతే తరువాత ఏర్పడి పరిణామాలు ప్రమాదకరంగానే ఉంటాయన్నది నిపుణులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా కూడా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
కోవిడ్ నియంత్రణకు శక్తి వంచన లేకుండా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిని తక్కువ చేసేందుకు లేదు. అయితే కోవిడ్ కారణంగా ఏర్పడే బయో వ్యర్థ పదార్ధాలను కూడా పర్యావరణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా శుద్ధీకరించే ప్రయత్నం ఇప్పటి నుంచే ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు.