iDreamPost
android-app
ios-app

భూమా అఖిల జైలుకే..!

భూమా అఖిల జైలుకే..!

శాసించే స్థాయి నుంచి శోకించే స్థితికి భూమా కుటుంబ రాజ‌కీయం చేరింది. క‌ర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు బాగానే ఉండేవి. ఇప్పుడు అలాంటి కుటుంబం పేరు చెప్ప‌గానే.. కబ్జాలు.. హత్యలు.. కిడ్నాప్‌లు గుర్తుకొస్తున్నాయ్. భూమా నాగిరెడ్డి.. ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి.. వారుసురాలిగా వ‌చ్చిన భూమా అఖిల ప్రియ.. మొదటి నుంచి వివాదాల్లోనే నానుతున్నారు. కర్నూలు జిల్లాలో కొన్నాళ్ళ క్రితం సొంత పార్టీకి చెందిన నేతనే హత్య చేయించేందుకు భూమా అఖిలప్రియ ప్రయత్నించారనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఆ కేసు అలా వుండగానే, ఇప్పుడు భూమా అఖిలప్రియ ఇంకోసారి వివాదాల్లోకి ఎక్కారు. హైదరాబాద్ బోయినపల్లిలో జ‌రిగిన కిడ్నాప్ చేసిన కేసులో భూమా అఖిలప్రియను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బోయినపల్లిలోని పోలీస్ స్టేషన్ కు తరలించిన అఖిల ప్రియ‌ను అక్కడి నుంచి బేగంపేట్ లోని మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

చంచల్‌గూడ మహిళా జైలులో అఖిలప్రియ

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏ-2 నిందితురాలిగా ఉన్న అఖిల ప్రియను 14రోజులు రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్న అఖిల ప్రియ తరపు న్యాయవాదులు వాదించారు. బెయిల్‌ మంజూరు చేయాలని అఖిల ప్రియ తరపు న్యాయవాది సచిన్‌ కుమార్‌ పిటిషన్ దాఖ‌లు చేశారు. దీంతో బెయిల్‌ పిటిషన్‌పై పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. గురువారం సికింద్రాబాద్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది. రిమాండ్‌ అనంతరం పోలీసులు భూమా అఖిలప్రియను చంచల్‌ గూడ జైలుకు తరలించారు. మంగ‌ళ‌వారం రాత్రి 11 గంటలకు మాజీ హాకీ ప్లేయ‌ర్ ప్రవీణ్ రావు, ఆయ‌న సోద‌రుల ఇంటికి వచ్చిన కొందరు తాము ఐటీ అధికారులమంటూ చొరబడ్డారు. తర్వాత భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్ రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్ చేశారు. టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి కాపాడిన విష‌యం తెలిసిందే. హాఫీజ్ పేటలోని 100 కోట్ల విలువైన భూమి కోసమే ఈ గొడవ జరిగిందని.. కిడ్నాప్ కు దారితీసిందని తెలుస్తోంది. ప్రస్తుతం కిడ్నాప్ అయిన ముగ్గురు క్షేమంగా ఇంటికి చేరారు. వెంటనే స్పందించిన తెలంగాణ పోలీసులకు ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో అఖిల ప్ర‌స్తుతం జైలు జీవితం గ‌డుపుతున్నారు.