iDreamPost
android-app
ios-app

నాణ్యమైన విద్య అంటే స్కూళ్లు మూసేయడమేనా అచ్చెన్నా..?

నాణ్యమైన విద్య అంటే స్కూళ్లు మూసేయడమేనా అచ్చెన్నా..?

నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ నేతల తీరు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనను విమర్శిచేందుకు టీడీపీ నేతలు తమ ప్రభుత్వ హాయంలో ఇంత కంటే బాగా చేశామని చెప్పుకుంటున్నారు. అయితే పని చేసి చెప్పుకుంటే ఫర్వాలేదు.. కానీ నాడు చంద్రబాబు ప్రభుత్వం పని చేసిన తీరుకు పూర్తి భిన్నంగా ప్రస్తుతం వారు చెప్పే మాటలు ఉండడం ఇక్కడ విశేషం.

అచ్చెం నాయుడు గొప్పలు..

తమ రెండేళ్ల పాలనలో ఏం చేశామో వైసీపీ ప్రభుత్వం ఓ బుక్‌లెట్‌ రూపంలో పొందుపరిచి ప్రజల ముందు ఉంచింది. అందులో టీడీపీ నాయకులు కొంత మంది తలా ఓ అంశం తీసుకుని విమర్శలు చేసే పని పెట్టుకున్నారు. అచ్చెం నాయుడు విద్య అంశంపై మాట్లాడారు. నాణ్యమైన విద్యలో తమ ప్రభుత్వ హాయంలో ఏపీ మూడో స్థానంలో ఉందని, ప్రస్తుత వైసీపీ సర్కార్‌ హాయంలో 19వ స్థానానికి పడిపోయిందని చెప్పుకొచ్చారు. కమీషన్ల కోసం నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పేరిట హడావుడి చేయడం తప్పా.. ప్రభుత్వం నాణ్యమైన విద్యపై దృష్టి పెట్టలేదని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడైన అచ్చెం నాయుడు విమర్శించారు.

ప్రజలు మరచిపోలేదు అచ్చెన్నా..

టీడీపీ ప్రభుత్వ హాయంలో నాణ్యమైన విద్య అందించామని అచ్చెం నాయుడు చెప్పుకున్నా.. నాడు ప్రభుత్వ విద్య ఎలాంటి పరిస్థితులలో ఉందో ప్రజలు ఇంకా మరచిపోలేదు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేలా, నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్‌ స్కూళ్లకు అనుకూలంగా చంద్రబాబు ప్రభుత్వం పేద, మధ్య తరగతి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసింది. రేషనలైజేషన్‌ పేరుతో.. 30 మంది కన్నా తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మూసివేసింది. అందులో ఉన్న విద్యార్థులను సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో చేరాలని పేర్కొంది. చిన్న పిల్లలు దూరంగా ఉన్న గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లగలరా..? అనేది కూడా ఆలోచించలేదు. పిల్లలకు విద్య.. భవిష్యత్‌కు పెట్టుబడి అనే మాటను కూడా మరచిపోయి.. ఖర్చులు తగ్గింపు పేరిటి స్కూళ్లను మూసేయండంతో అటు ప్రైవేటు స్కూళకు పోలేక, ఇటు గ్రామంలో పాఠశాల లేక ఎంతో మంది చిన్నారులు విద్యకు దూరమయ్యారు. జూన్‌లో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైతే అక్టోబర్‌లో పాఠ్యపుస్తకాలు ఇస్తూ.. ఓ పద్ధతి ప్రకారం ఉన్నత పాఠశాలను దెబ్బతీశారు. యూనిఫాంల పరిస్థితి కూడా ఇంతే.. పాఠశాల ప్రారంభమైన నాలుగైదు నెలలకు ఇచ్చిన యూనిఫాంల సైజులు కూడా భిన్నంగా ఉండేవి. ఫలితంగా విద్యార్థులకు అవి సౌకర్యంగా ఉండేవి కావు.

నాణ్యత కనిపించడం లేదా..?

వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. టీడీపీ ప్రభుత్వంలో మూసేసిన అన్ని పాఠశాలలను తిరిగి మొదటి ఏడాదిలోనే తెరిపించింది. విద్యార్థుల సంఖ్యతో పని లేకుండా పాఠశాలలను నిర్వహిస్తోంది. అవసరమైన చోట విద్యా వాలంటీర్లను కూడా నియమించింది. నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేసింది. తన నియోజకవర్గంలోని ఏదైనా పాఠశాలకు వెళ్లినా.. అచ్చెం నాయుడుకు నాడు నేడు కార్యక్రమం వల్ల జరిగిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టింది. అదీ కూడా సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఈ ఏడాది నుంచి అమలు చేయబోతోంది. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రాథమిక దశ నుంచే అందించేలా జగన్‌ సర్కార్‌ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు ఆరేళ్ల వయస్సులోపే గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. అంగన్‌వాడీ స్కూళ్లలోనే వారి భవిష్యత్‌కు గట్టి పునాది వేసేలా చర్యలు చేపట్టింది. ఇంగ్లీష్‌ మీడియం వద్దూ.. తెలుగే ముద్దు అంటూ టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లడం, నెలల తరబడి తమ అనుకూల పత్రికల్లో స్టేట్‌మెంట్లు ఇవ్వడం మరచిపోయిన అచ్చెం నాయుడు నాణ్యమైన విద్య గురించి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉంది.

Also Read : అన్న‌ట్టు.. చంద్ర‌బాబు వ్యాక్సిన్ వేసుకున్నారా?