Idream media
Idream media
అస్సోం అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ నేడు జరగనుంది. 39 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. బరిలో 345 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 73.44 లక్షలుగా ఉంది. నేటి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, కొందరు విపక్ష ప్రముఖులు సహా అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
తొలిదశలో 46 స్థానాల్లో ఓటింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో ‘చొరబాటుదారుల’ అంశం ప్రధాన ఆయుధంగా మారింది. రెండు సంవత్సరాలక్రితం ఎన్ఆర్సీ తుది జాబితా విడుదలయ్యాక రాష్ట్రంలో అలజడి రేగింది. దాదాపు 20 లక్షలమంది ఇక్కడి పౌరులు కారని నిర్ధారించటం అందుకు కారణం. వీరంతా ఈ దేశస్తులమేనని నిరూపించుకోవటానికి అవసరమైన పత్రాలు లేని నిరక్షరాస్యులు, నిరుపేద వర్గాల వారిలో ఉన్నారు. చివరకు దీన్ని రద్దు చేసి, కాబోయే ఎన్ఆర్సీలో అస్సాంను కూడా చేర్చమని ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరాల్సివచ్చింది.
బంగ్లాదేశ్ సరిహద్దులను ఆనుకుని ఉన్న కరీంగంజ్, కచార్ జిల్లాల్లో జరిగే ఎన్నికల్లో చొరబాటుదారుల అంశమే నిర్ణయాత్మకం. 2016లో బరాక్ వ్యాలీలో ఉన్న 18 సీట్లలో 11 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి పరిస్థితి అంత ఈజీగా కనిపించడం లేదు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఎగసిన అసంతృప్తి జ్వాలలు బీజేపీని చుట్టుముట్టాయి. భాగస్వామ్య పక్షాలైన ఏజీపీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్)తో కూడా కాషాయసేనకు అంతగా పొసగడం లేదు. ఐదు చోట్ల ఈ పార్టీల నుంచి స్నేహపూర్వక పోటీలను ఎదుర్కొంటోంది. సీఏఏను అమలు చేసి తీరతామన్న బీజేపీ ప్రకటనలు ఈ రెండు పార్టీలకూ ఇబ్బందికరంగా మారాయి. అధికారంలోకొస్తే సీఏఏను అమలు చేయనివ్వబోమని ప్రకటించిన కాంగ్రెస్- సారథ్య మహాకూటమి గట్టి సవాల్ విసురుతోంది. కొత్తగా ఏర్పడ్డ అసొం జాతీయ పార్టీ (ఏజేపీ) 19 సీట్లలో అభ్యర్థులను దింపింది. 25 నియోజకవర్గాల్లో ఎన్డీఏ, మహాకూటమి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది.
అధికారంలోకొస్తే చొరబాటుదారులను ఏరిపారేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ సారథ్య మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ- ‘జాగ్రత్తగా విను అజ్మల్…చొరబాటుదార్లకు కేంద్ర స్థానంగా అసొంను మారనివ్వం’’ అని ఆయన బోడోలాండ్ ప్రాంతంలోని బిజినీలో జరిగిన ఎన్నికల సభలో అన్నారు. ‘‘ఏఐయూడీఎఫ్ గుర్తు తాళం-చెవి. ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు మా వద్ద ఉన్న తాళం చెవే దిక్కు అని బద్రుద్దీన్ అంటున్నారు. కానీ సిసలైన తాళం చెవులు ప్రజల వద్ద ఉన్నాయన్న సంగతి ఆయన మరిచారు. అధికారమిస్తే మహాకూటమి చొరబాట్లకు దార్లు తెరుస్తుంది. ఇన్నేళ్లూ కాంగ్రెస్ వాటిని ఆపలేకపోయింది. మాకు మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి. చొరబాటుదారుల సంగతి దేవుడెరుగు, ఆఖరికి అక్రమంగా ఒక్క పక్షిని కూడా అసొంలో ఎగరనివ్వం’’ అని అమిత్ షా అంటున్నారు.
‘‘నా పేరు నరేంద్ర మోదీ కాదు… నేను అబద్ధాలాడను. మీరు నిజాలు వినాలనుకుంటే నా మాటలు వినండి. అబద్ధాలు వినాలనుకుంటే టీవీ ఆన్ చేయండి. మోదీ 24-7 అబద్ధాలు వినవచ్చు. ఇది అసొం. వివిధ మతాలు, జాతులు, సిద్ధాంతాలు శాంతియుతంగా కలిసి జీవనం చేస్తున్న నేల. బీజేపీ వచ్చి సోదరుల మధ్యే చిచ్చుపెట్టింది. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల్లో దీపాంజల్ దాస్ అనే వ్యక్తిని కాల్చిచంపారు. ఆయన ప్రశాంత అసొంకోసం బలిదానం చేశారు. ఆయన అభీష్టాన్ని నెరవేర్చేందుకైనా మేం సీఏఏను అమలు చేయం…’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామరూప్ జిల్లాలోని చేగాం, నల్బడీ జిల్లాలోని బార్ఖేత్రి నియోజకవర్గ సభల్లో పేర్కొన్నారు. సర్వేలు మాత్రం ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి అంటున్నాయి. మరి గెలుపెవరిదో చూడాలి.