ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న విషయాలలో గంజాయి అక్రమ సాగు, రవాణాను అరికట్టడం కూడా ఒకటి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విధాలుగా గంజాయి అక్రమరవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంది. గంజాయి మాత్రమే కాక మద్యం లాంటి ఇతర మత్తుపదార్థాలను యువతకు దూరం చేయాలని అనేక చర్యలు తీసుకుంటోంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఒక దానిని ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక విధాలుగా దాడులు చేస్తూ గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తమకు పట్టుబడిన రెండువేల కేజీల గంజాయిని దహనం చేయనుంది. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంతో రాష్ట్రం లో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్ లో రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలు, సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక సార్లు రైడ్ చేస్తూ తోటలు ధ్వంసం చేస్తూ వచ్చింది.
అనేక దశాబ్దాలుగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ తో పాటు విశాఖపట్నంలోని గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగు పై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉక్కుపాదం మోపిన పోలీస్ శాఖ.. ఆ క్రమంలో పట్టుబడిన గంజాయిని నేడు దహనం చేయనుంది. ఈ గంజాయి విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. ఈ గంజాయి దహనం కార్యక్రమాన్ని పోలీస్ శాఖ పెద్ద ఎత్తున జరుపుతూ ఉండడంతో డీజీపీ గౌతం సవాంగ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.