iDreamPost
android-app
ios-app

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రంగా ఏపీ..

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రంగా ఏపీ..

ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి కొవిడ్ – 19 చికిత్స‌ను తెచ్చిన ఘ‌న‌త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే..

క‌రోనా విజృంభ‌ణ వేళ‌.. ప్రైవేటు ఆస్ప్ర‌తుల‌ను సైతం ప్ర‌భుత్వ అధీనంలోకి తీసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌..
9 ల‌క్ష‌ల మందికి పైగా శాంపిల్స్ సేక‌రించి క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మే..బ‌డ్జెట్ లో ఆరోగ్య శాఖకు రూ. 11, 419. 44 కోట్లు కేటాయించి ప్రజల ప్రాణాల‌కు భ‌రోసా క‌ల్పించినా.. కోటీ 42 ల‌క్ష‌ల మందికి స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ చేసినా అది జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ఏర్ప‌డిన ప్ర‌భుత్వ హ‌యాంలోనే జ‌రిగింది…
ఏ పేద‌వాడైన ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుని.. అనంత‌రం కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వ‌స్తే.. ఆ కాలంలోనూ పేద‌లు ఇబ్బంది ప‌డ‌కుండా.. డా.వైఎస్ఆర్ ఆరోగ్య ఆస‌రా పేరుతో రోజుకు రూ. 225 అందిస్తున్న రాష్ట్రం ఏపీ మాత్ర‌మే…

ఇన్ని ఘ‌న‌త‌ల న‌డుమ ప్ర‌జ‌ల ప్రాణాల పరిరక్షణకు సంబంధించి నేడు మ‌రో సువ‌ర్ణాధ్యాయానికి జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టబోతున్నారు. 108, 104 స‌ర్వీసుల‌కు చెందిన 1088 వాహ‌నాల‌ను ఒకేసారి అందుబాటులోకి తేనున్నారు.

ఏ ఇంట్లో అయినా… అర్థిక ఇబ్బందుల‌కు అధిక శాతం కార‌ణాలు విద్య‌, వైద్య రంగాల‌కు ఎక్కువ‌గా వెచ్చించాల్సి రావ‌డ‌మే. గ‌త ప్ర‌భుత్వాల‌న్నీ ఆదాయ వ‌న‌రులుగా వాటిని చూసేవి. ఆ రంగాల్లో ప్రైవేటు సెక్టార్ల‌ను ప్రోత్స‌హించేవి. కానీ.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక‌.. ప్ర‌జ‌ల ఆర్థిక బాధ‌ల‌కు కార‌ణాల‌ను గుర్తించి వైద్య‌, విద్య రంగాల‌పై ప్ర‌ధాన దృష్టి సారించారు. ఒక వైపు ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దుతూ.. అమ్మ ఒడి ప‌థ‌కం ద్వారా నేరుగా సామాన్య కుటుంబాల‌కు ల‌బ్ది చేకూరుస్తున్నారు. వైద్య రంగంలో కూడా విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. దారిద్య్ర‌రేఖ‌కు దిగువ‌న ఉన్న ఏ కుటుంబ‌మైనా.. ఆస్ప‌త్రి ఖ‌ర్చు 1000 రూపాయ‌లు దాటితే చాలు.. ఆరోగ్య శ్రీ ప‌రిధిలో చికిత్స పొందే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

రాష్ట్రంలో ఉంటున్న వారే కాదు.. ఉపాధి కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉంటున్న వారి కోసం కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద 130 ఆసుపత్రులను ఎంపిక చేసింది ఏపీ ప్రభుత్వం. గ్రామ, వార్డు స్థాయిలో 11000 కు పైగా వైయస్ఆర్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 కొత్త వైద్య కళాశాలను కూడా అందుబాటు లోకి తేనున్నారు. క్యాన్సర్, మూత్ర పిండాల సమస్యల చికిత్స నిమిత్తం సూపర్ స్పెషాలిటీ ఆస్ప త్రులు నిర్మించ నున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు… ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా 1088 అంబులెన్స్ వాహ‌నాల‌ను అందుబాటులోకి తెస్తూ.. పేదోడు ఆప‌ద‌లో ఉంటే 20 నిమిషాల్లోనే అక్క‌డ‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు

జగన్ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు

పేద‌ల ఆరోగ్య అవ‌స‌రాల‌కు సంబంధించి జ‌గ‌న్ చేప‌డుతున్న సంస్క‌ర‌ణ‌ల‌కు సామాన్యుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆరోగ్య శ్రీ ద్వార ఉచితంగా శ‌‌స్త్ర‌చికిత్స పొంది శ‌స్త్ర‌చికిత్స అనంత‌ర భ‌త్యం పొందిన విశాఖ జిల్లాకు చెందిన వైరా వేంక‌టేశ్వ‌ర్ల కుటుంబం జ‌గ‌న్ కు ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటామ‌ని పేర్కొంది. కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి ఆదర్శమంటూ కొద్ది రోజుల క్రితం యూకే డిప్యూటీ హై కమిషనర్‌ ఫ్లెమింగ్‌ ప్రశంసలు కురిపించారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో టెస్ట్ లు చేస్తూ.. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం చేస్తున్న చ‌ర్య‌లు భేష్ అంటూ ట్వీట్ చేశారు.

200 కోట్లు ఖ‌ర్చు చేస్తే.. 300 కోట్ల అవినీత‌ట‌..!

ఏ వంకా లేన‌మ్మ‌.. డొంక అట్టుకుని వేలాడింది అన్న‌ట్లు ప్ర‌భుత్వంపై టీడీపీ విమ‌ర్శ‌ల‌పై ప్ర‌జ‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు న‌వ్వుకుంటున్నారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతుంటే.. ఆ పార్టీ ఆరోప‌ణ‌లు వింత‌గా ఉంటున్నాయి. ఆరోగ్య‌అధునాతన 108,104 వాహనాల కోసం ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది రూ.200 కోట్లు అయితే అందులో ఏకంగా రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ప్ర‌చారం చేశారు. దీనిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు ర‌మ్మ‌ని వైసీపీ నేత‌లు స‌వాలు విసిరితే మాత్రం నోటంట మాట రాలేదు.