iDreamPost
android-app
ios-app

బ్రహ్మంగారి మఠం పీఠం దక్కేది ఎవరికో..? తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు

బ్రహ్మంగారి మఠం పీఠం దక్కేది ఎవరికో..? తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు

దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి మఠం పీఠాధిపతి వివాదం ముగింపు దశకు వచ్చింది. పెద్దమనుషులు కుదిర్చిన రాజీని కాదని ఇటీవల స్వర్గస్తులైన పిఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతీ మహాలక్ష్మమ్మ గత నెల 30వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వంతోపాటు ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ రోజు తీర్పును రిజర్వ్‌ చేయడంతో ఈ వివాదానికి దాదాపు ఫుల్‌స్టాప్‌ పడినట్లేనని కందిమల్లాయపల్లి గ్రామస్తులు, బ్రహ్మంగారి భక్తులు భావిస్తున్నారు.

ఇటీవల పరమపదించిన పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి స్థానంలో నూతన పీఠాధిపతి ఎంపిక జరగాల్సి ఉండగా.. పీఠాధిపతి ఎవరుండాలనే అంశంపై ఆయన రాసిన వీలునామాతో వివాదం చెలరేగింది. వేంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య చంద్రావతికి 8 మంది సంతానం. నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. చంద్రావతి మరణించిన తర్వాత వేంకటేశ్వరస్వామి మారుతీ మహాలక్ష్మమ్మను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు 13, 10 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులున్నారు. సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యుల్లో పెద్దవారు పీఠాధిపతి కావాలి.

అయితే చంద్రావతి కిడ్నీ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెకు కిడ్నీ దానం చేసిన వారికి పిఠాధిపతి పదవి దక్కేలా వేంకటేశ్వరస్వామి వీలునామా రాశారు. రెండో కుమారుడు వీరభద్రయ్య కిడ్నీ దానం చేశారు. వీరభద్రయ్య తర్వాత రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడు పీఠాధిపతి అయ్యేలా వీలునామలో పేర్కొన్నారు.

Also Read : సుప్రింకు చేరిన జల వివాదం.. తెలంగాణను తూర్పారబట్టిన..

వేంకటేశ్వరస్వామి తర్వాత పీఠాధిపతిగా ఎవరు ఉండాలనే అంశంపై కందిమల్లాయపల్లి గ్రామస్తులు కొంత మంది వేంకటేశ్వరస్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి, మరికొంత మంది తల్లికి కిడ్నీ దానం చేసిన రెండో కుమారుడు వీరభద్రయ్యకు మద్ధతుగా నిలబడ్డారు. వీలునామా ప్రకారం పీఠాధిపతిగా తన కుమారుడుకు కూడా అవకాశం ఉందని, అయితే వారు చిన్నపిల్లలు కావడం వల్ల అప్పటి వరకు తాను పీఠాధిపతిగా ఉంటానంటూ మారుతీ మహాలక్ష్మమ్మ పట్టుబట్టారు. పలు దఫాలు చర్చల తర్వాత.. పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా, రెండో కుమారుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా ఎన్నుకున్నారు.

వెంకటాద్రి స్వామి తర్వాత వీరభద్రయ్య పీఠాధిపతిగా ఉంటారు. ఆయన తర్వాత మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడు పీఠాధిపతి అవుతారు. అప్పటి వరకు మారుతీ మహాలక్ష్మమ్మకు భృతిగా ప్రతి నెలా కొంత మొత్తం నగదు పీఠాధిపతి చెల్లించేలా అవగాహన ఒప్పదం కుదిరింది. వారి యోగ క్షేమాలు కూడా పీఠాధిపతియే చూసేలా పెద్దలు ఒప్పందం కుదిర్చారు. మంచి ముహూర్తాన వెంకటాద్రి స్వామి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారని దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్‌ ఆజాద్‌ ప్రకటించారు.

పెద్దల సమక్షంలో రాజీకి వచ్చిన మారుతీ మహాలక్ష్మమ్మ.. ఆ రోజు రాత్రి అక్కడ నుంచి తన స్వగ్రామం ప్రకాశం జిల్లా టంగుటూరుకు వెళ్లారు. పీఠంపై హక్కును కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కుటుంబంలో పెద్దవారే మఠాధిపతిగా ఉండాలనే నియమం లేదని, పీఠాధిపతి కావాలనుకుంటున్న వెంకటాద్రి స్వామికి అందుకు తగిన అర్హతలు లేవని, ఆయన న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారంటూ మహాలక్షమ్మ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తరతరాలుగా వస్తున్న ఆచార, సంప్రదాయాల ప్రకారం మఠాధిపతి అయ్యే అర్హత తనకే ఉందని, మహిళలు పీఠాధిపతులుగా చేసిన దాఖలాలులేవని వెంకటాద్రి స్వామి తరఫు న్యాయవాది వాదించారు. ఇరు వైపుల వాదనలు పూర్తి కావడంతో.. కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. తీర్పు ఎప్పుడు వెల్లడిస్తారనేది తెలియాల్సి ఉంది.

Also Read : రేవంత్ పై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి పొగడ్తల వర్షం.. సొంత గూటికి చేరడం ఖాయమేనా..?