iDreamPost
android-app
ios-app

ఏపీ సర్కారు ఆక్వా రైతుకు ఎలాంటి చేయూత అందిస్తోంది..?

  • Published Feb 01, 2022 | 7:14 AM Updated Updated Feb 01, 2022 | 7:14 AM
ఏపీ సర్కారు ఆక్వా రైతుకు ఎలాంటి చేయూత అందిస్తోంది..?

చేప ఎండకుండా ఉండాలంటే మోటారుతో నీటిని తోడి చెరువు నింపాలి. చెరువులో రొయ్య బతికుండాలంటే నిరంతరం విద్యుత్‌ అందుబాటులో ఉండాలి. ఈ రెండిటిలో ఏది జరగకపోయినా ఆక్వా రైతు ఆస్తులు అమ్ముకున్నా తీర్చలేనంత అప్పులపాలవడం ఖాయం. అందుకే ఆక్వా రైతులు ఖర్చెంతైనా పర్లేదనుకుంటూ డీజిల్‌ మోటార్లు వాడుతుంటారు. పెట్రోల్‌తో సమానంగా డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉండటంతో పెట్టుబడులకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి సమయంలో నేనున్నానంటూ ఆదుకున్నారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చేపలు, రొయ్యల చెరువుల విద్యుత్‌ సర్వీసులకు రూ.3.85 ఉన్న క్రాస్‌ సబ్సిడీని రూ.2.35కు తగ్గించారు. 60,472 సర్వీసులకు సబ్సిడీపై యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే అందేలా చేశారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. అయినా ప్రభుత్వం ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఈ భారాన్ని భరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆక్వాసాగుకు నిరంతర విద్యుత్‌ను సమకూరుస్తున్నాయి. ఫలితంగా డీజిల్‌ వాడకం కొన్ని ప్రాంతాల్లో సగానికిపైగా, మరికొన్ని ప్రాంతాల్లో దాదాపు పూర్తిగా తగ్గిపోయింది.

తగ్గిన ఆర్థికభారం..

గతంలో విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉండటంతో ఎకరానికి రోజుకు 40 లీటర్ల డీజిల్‌ అవసరం ఉండేది. దానికి నెలకు రూ.86,800 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రైతులకు యూనిట్‌ కరెంటును రూ.1.50కి అందించారు. దీంతో ఇప్పుడు ఎకరానికి నెలకు కేవలం విద్యుత్‌ బిల్లు దాదాపు రూ.5,800 వస్తోంది. సబ్సిడీ లేకపోతే ఇదే బిల్లు నెలకు రూ.25 వేలకుపైనే వస్తుంది. విద్యుత్‌ను సబ్సిడీతో నిరంతరం ఇవ్వడం వల్ల ఆక్వా రైతులందరూ సంతోషంగా ఉన్నారు.

ఆక్వా రైతులకు వరం..

దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. ఒక పంట సాగుకు నాలుగు నెలలు సమయం పడుతుంది. 2019 ప్రారంభంలో నాలుగు నెలలకు ఒక ఎకరం రొయ్యల సాగుకు డీజిల్‌ కోసం రూ.3,47,200 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఒక్కో ఎకరానికి రోజుకు కనీసం 40 లీటర్ల డీజిల్‌ వినియోగించేవారు. ఇప్పుడు విద్యుత్‌ ధర రూ.1.50 చేయడం వల్ల నాలుగు నెలలకు కరెంటు బిల్లు రూ.24 వేలు మాత్రమే వస్తోంది. లక్షల్లో ఖర్చు మిగులుతోంది. ఈ ప్రభుత్వం విద్యుత్తు ధరలు తగ్గించడం తమకు ఇచ్చిన వరమని ఆక్వా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఏపీ గురించి ఆర్థిక సర్వే చెప్పిన సంచలనాలు..