ప్రతిపక్షాల అన్ని ఆరోపణలకు సీఎం జగన్ ఒకేసారి కౌంటర్ ఇచ్చారు. పదో తరగతి ఉత్తీర్ణతశాతంపై రాజకీయ పార్టీల అనవసరపు రాజకీయ రగడతోపాటు, కోనసీమ ఉద్రిక్తతలకు కారణమెవ్వరో జనం ముందుంచారు.
అనంతపురం జిల్లాను ఎడారి జిల్లా అన్నారని, దేవుడి దయతో అలాంటి పరిస్థితులు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. 2021 ఖరీఫ్లో పంటనష్టపోయిన 15.61 లక్షలమంది రైతులకు రూ.2,977.72 కోట్లు ఇస్తున్నామని అన్నారు.
ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రైతులకు బీమా కింద రూ.885 కోట్లు చెల్లిస్తున్నాం. ఇంతకు ముందు బీమా వస్తుందో లేదో తెలియదు. ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో తెలియని పరిస్థితి. ఒక సీజన్లో నష్టం జరిగితే, అదే సీజన్ రాకముందే, రైతుల చేతుల్లో పెడుతున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పంటల బీమా పరిహారాన్ని చెల్లిస్తున్నామని సీఎం అన్నారు. అదే సమయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూడని కోరారు.
టీడీపీ పాలనలో ఐదేళ్ల కాలానికి పంటల బీమా కింద 30.85 లక్షల మంది రైతులకు రూ.3411 కోట్లు ఇస్తే, ఈ మూడేళ్లలో 44.28లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమాతో రూ.6.685 కోట్లు చెల్లిస్తున్నామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వపు రూ.715.84 కోట్ల రూపాయల పంటల బీమా బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించింది. రైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీపడుతున్నాం. ఆర్బీకేలను చూసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు వస్తున్నారని అన్నారు.
వైఎస్సార్ రైతుభరోసా, పీఎం కిసాన్ కింద రూ.23,875కోట్ల రూపాయలను ఈ ఒక్క పథకం ద్వారానే రైతన్నల చేతుల్లో పెట్టాం. జూన్ రాకముందే, రైతు భరోసా సొమ్మును నేరుగా రైతన్నల ఖాతాల్లో వేశాం. రైతుల కోసం మీ బిడ్డ ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల రూ.1,27,823 కోట్లని సీఎం జగన్ గర్వంగా చెప్పారు.
పగటి పూటే 9 గంటలపాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అందుకే ఫీడర్లకోసం రూ.1700 కోట్లు ఖర్చు చేశాం . గత ప్రభుత్వపు రూ. 8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను చెల్లించామని, ధాన్యం చెల్లింపులకోసం రూ.960 కోట్ల బకాయిలనూ క్లియర్ చేశామని, విత్తనాల కొనుగోలు కోసం బకాయిలు పెట్టిన రూ. 384 కోట్ల డబ్బునుకూడా ఈ ప్రభుత్వమే చెల్లించిందని సీఎం జగన్ చెప్పారు. దురదృష్టవశాత్తూ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతన్న కుటుంబానికి రూ.7 లక్షల వెంటనే ఇస్తున్నాం. కౌలు రైతు ఆత్మహత్య దురదృష్టవశాత్తు చేసుకుంటే ప్రభుత్వం ఆదుకుంటుందని జగన్ చెప్పారు.
రైతులకు కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో వివరంగా చెప్పిన సీఎం జగన్, అక్కడ నుంచి ప్రతిపక్షాల విమర్శలను ఒక్కొక్కటిగా తిప్పికొట్టారు. పేరు ఎత్తుకుండానే చెడుగుడు ఆడుకున్నారు. బాబు దత్తపుత్రుడు అనంతపురం వచ్చాడు. గోదావరి జిల్లాలకు కూడా వెళ్లాడు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి, ఆత్మహత్య చేసుకుంటే, పరిహారం అందని రైతు కుటుంబాన్ని చూపించగలవా? అని సవాల్ విసిరితే.. చూపించలేకపోయారని విమర్శించారు. సీసీఆర్సీ కార్డు ఉండి, బలవన్మరణం చేసుకున్న కౌలు రైతును ఒక్కరినైనా చూపించగలవా? అంటే చూపించలేకపోయారు. 458 కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ఇవ్వకపోతే, జగనన్న ప్రభుత్వం మాత్రమే వారికి ఇచ్చింది. ఈ జిల్లాలకు పోవాలి, ఇలా గ్రామాలకు పోవాలని అని ఆ దత్తపుత్రుడికి ఆ రోజు గుర్తుకు రాలేదు. పరిహారం ఇవ్వాలని చంద్రబాబుకు అనిపించలేదని ఎత్తిచూపించారు.
సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే? ధాన్యం కొనుగోలు కోసం మూడేళ్లలో రూ.45వేల కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు ఐదేళ్లలో రూ.30-32వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. పాడి రైతులకు మంచి చేయడానికి అమూల్ను తీసుకు వచ్చాం. ప్రపంచంలోనే 8వ స్థానం ఆ కంపెనీది. బాబు కంపెనీ హెరిటేజ్తోపాటు అందరు కూడా, లీటరు రూ.5 నుంచి రూ.10లు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కపైసా కూడా అవినీతి లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, మీ చేతికే వస్తోంది. గతంలో ఇది ఎందుకు జరగలేదు?. అప్పుడు నేరుగా గత పాలకుల చేతుల్లోకి డబ్బులు పోయేవని జగన్ చెప్పారు.
గత మాదిరిగా మోసాలు చేసే పరిస్థితి లేదు. మాట ఇచ్చి తప్పితే, రైతు ఏమవుతాడన్న బాధ కూడా గత పాలకులకు లేదని మనం చూశాం. అలాంటి వాళ్లు రాజకీయాలకు తగునా? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి ఎలా మాట ఇచ్చాడు.. ఎలా మోసం చేశాడో మీరు చూశారు. ఆయన చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందని, అది చేయడానికి ఉరుకులు పరుగులు తీసే మరో వ్యక్తి దత్తపుత్రుడు. ప్రజలను మోసం చేసి, తోడుదొంగలైన వీరిద్దరు, రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా?. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అంటే, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు. వీళ్లంతా ఏకం అవుతారు. ఉన్నది లేనట్టుగా. లేనిది ఉన్నట్టుగా .. అబద్ధానికి రంగులు పూస్తారని నిశితంగా సీఎం జగన్ విమర్శించారు.
పదో తరగతి ఉత్తీర్ణతశాతం మీద రాజకీయ రగడ జరగడాన్ని ఎత్తిచూపించిన సీఎం జగన్, రెండేళ్ల కోవిడ్ తర్వాత టెన్త్పరీక్షలు జరిగాయి. పరీక్షలు లేకుండా పాస్ చేసుకుంటూ రెండేళ్లు వచ్చాం. 67శాతం మంది పాస్ అయ్యారు. గుజరాత్లో 65శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల తర్వాత పరీక్షలు రాసిన పిల్లలకు ఆత్మస్థైర్యం కల్పించే మాటలు చెప్పాలి. సప్లిమెంటరీ తీసేసి, రెగ్యులర్గానే వారిని భావిస్తూ వారికి మళ్లీ పరీక్షలు పెడుతున్నాం. ఆ పిల్లలనుకూడా రెచ్చగొట్టడానికి, చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మన పిల్లలకు ఇవ్వాల్సింది క్వాలిటీ చదువులు. ప్రపంచంతో పోటీపడేటప్పుడు, వారి చదువుల్లో క్వాలిటీ ఉండాలి. విద్యారంగంలో తీసుకు వస్తున్న మార్పులను తట్టుకోలేక దాన్ని కూడా రాజకీయంచేస్తున్నారని విమర్శించారు.
కోనసీమ గొడవలను ప్రస్తావిస్తూ, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ అనే మహానుభావుడి పేరును పెట్టాం. ఒక దళిత మంత్రి, బీసీ మంత్రి ఇళ్లను కాల్చేశారు. ఒక జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరుపెడితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదా సామాజిక న్యాయం? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా? మీ బిడ్డ మంత్రివర్గంలో 70శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్తున్నాం. ఉద్యోగుల విషయంలో కూడా ఇదే ధోరణి. ఉద్యోగలకు ప్రతి విషయంలో మంచి చేస్తున్నాం. ఇంతకు ముందు ఎవ్వరూ కూడా సాహసం చేయలేదు. వారికి మంచి జరుగుతుందని వారికి నచ్చజెప్పి, వారిని కలుపుకుంటూ పోతే.. వారినికూడా రెచ్చగొట్టే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. వీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీ బిడ్డ ఎదుర్కోగలడు. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మీ బిడ్డ ఎవ్వరినైనా ఎదుర్కోగలడని సీఎం జగన్ అన్నారు.
78070