iDreamPost
iDreamPost
ఏపీలో ఇసుక సమస్య మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల క్యాబినెట్ ఆమోదం తర్వాత విధానంలో పలు మార్పులు చేశారు. దాంతో ఇక ఇసుక ఇక్కట్లు తీరినట్టేనని అంతా భావిస్తున్నారు. ఇకపై ఎక్కడి నుంచైనా ఇసుక తెచ్చుకునే అవకాశం కల్పించారు. ఆన్ లైన్ విధానం సడలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరే అమలు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ప్రజలకు చౌకగా ఇసుక అందుబాటులోకి రాబోతోంది. అధిక రేట్లకు అమ్మకుండా నియంత్రణ చర్యలకు పూనుకుంటున్నారు. అంతేగాకుండా సామాన్యులు ఇంటి నిర్మాణం కోసం ఎడ్ల బండ్లలో ఇసుక తీసుకెళితే ఉచితం అని ప్రకటించారు.
ఈమేరకు సవరించిన ఇసుక పాలసీ నిబంధనలతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రజలు తమకు నచ్చిన రీచ్కు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి, అక్కడికక్కడే డబ్బు చెల్లించి, కావాల్సిన చోటుకు ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది. ఇకపై నెట్ పని చేయడం లేదని, యాప్ పని చేయడం లేదంటూ నెట్ సెంటర్ల వద్దకు పరుగులు తీయాల్సిన శ్రమ ఏమాత్రం అక్కర లేదని పేర్కొంది. ఆన్లైన్ మోసాలకు ఆస్కారమే లేకుండా. సిఫార్సుల ఊసు ఉండకుండా కొత్త ఇసుక పాలసీని అమలులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది జీఓ జారీ చేశారు.
సవరించిన ఇసుక పాలసీలో ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయం బాధ్యతలను నామినేషన్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుంది. నిర్ణయించిన మొత్తాన్ని ఆయా సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఏపీఎండీసీ తరుపున లేఖలు రాశారు. స్పందించిన సంస్థకు ఈ బాధ్యత అప్పగించబోతున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ముందుకు రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస టెండరు ధర ఖరారు చేసి అనుభవం, సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక పరిపుష్టి ఉన్న సంస్థలను టెక్నికల్, కమర్షియల్ బిడ్ల ద్వారా ఎంపిక చేస్తుంది.
దానికి తగ్గట్టుగా మొత్తం రీచ్లు మూడు ప్యాకేజీలుగా వర్గీకరణ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలను మొదటి ప్యాకేజీ కింద.. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు రెండవ ప్యాకేజీగా.. నెల్లూరు, అనంతపురం, కృష్ణా, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలను మూడో ప్యాకేజి కింద చేర్చారు. ఇసుక లభ్యత పెంచడానికి ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో డ్రెడ్జింగ్ చేస్తారు. భూగర్భ గనులు, జల వనరుల శాఖల సహకారంతో దీన్ని చేపడతారు. ఎవరికి ఎంత ఇసుక కావాలన్నా బుక్ చేసుకుని తీసుకెళ్లవచ్చు. దీనిపై పరిమితులు ఉండవు. స్టాక్ యార్డుల్లో, రాష్ట్రంలోని నిర్ధారిత నగరాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక సరఫరా జరుగుతుంది.
అంతేగాకుడా ఆఫ్లైన్ విధానంలోనే డబ్బు చెల్లించి ఇసుకను తీసుకెళ్లొచ్చు. ఆన్లైన్ విధానం ఉండదు. స్టాక్ యార్డులు/ రీచ్ల నుంచి ఇసుక తీసుకెళ్లడానికి వినియోగదారులే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి. ఆయా సంస్థలు ప్రతి స్టాక్ యార్డు/ రీచ్లలో 20 వాహనాలను అందుబాటులో ఉంచాలి. ఈ సంస్ధలు నిర్ణీత పూచీకత్తు మొత్తం (పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ – పీఎస్టీ ) చెల్లించాలి. రీచ్లకు సమీపంలోని గ్రామాల వారికి, బలహీన వర్గాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ పనులకు, సహాయ పునరావాస కార్యక్రమం కింద నిర్మించే ఇళ్లకు కూపన్ల జారీ ద్వారా ఇసుకను ఉచితంగా ఇస్తారు. అక్రమ తవ్వకాలు, నిల్వ, రవాణాను నియంత్రించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు దాడులు చేసి, కేసులు నమోదు చేసే అధికారముంటుంది. మెరుగైన ఇసుక విధానం అమలుకు భూగర్భ గనుల శాఖ సంచాలకులు, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండీ అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.