ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం పలు పథకాల అమలుకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు సరికొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21న ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. ఈ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ. 24వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.
మత్స్యకారులకు రూ. 10వేలు ఆర్థిక సహాయం
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేయనుందని తెలిపారు. మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్కు తొమ్మిది రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించారు. మత్స్యకారులు డీజిల్ పోయించుకున్నప్పుడే సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. నవంబర్ 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించబోతోందని, ఆ రోజు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. తెప్పలపై చేపల వేటకు వెళ్లేవారు కూడా ఈ పథకానికి అర్హులని తెలిపారు.
న్యాయవాదులకు రూ. 5వేలు
న్యాయవాదులకు రూ. 5వేల ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. డిసెంబర్ 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు ఈమేరకు ప్రోత్సాహం అందించనుంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రవాణా వాహనాలు
పలాసలోని 200 పడకల ఆస్పత్రిలో నియామకాలకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులను గుర్తించి.. ప్రభుత్వమే హామీగా ఉండి రవాణా వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. అదేవిధంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
హోంగార్డుల జీతాలు పెంపు
రాష్ట్రంలోని హోంగార్డుల జీతాలను పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హోంగార్డుల రోజువారీ వేతనం రూ. 600 నుంచి రూ. 710కి పెంచింది. దీంతో హోంగార్డుల వేతనం నెలకు రూ. 18వేల నుంచి రూ. 21,300కు పెరిగింది.