నదులు, రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. నదుల ప్రవాహం వర్షాలపై ఆధారపడితే, రాజకీయ గమనాన్ని సమీకరణాలు, లాబీయింగ్లు ప్రభావితం చేస్తాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మార్పుతో ఆ పార్టీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీలో టీడీపీ టీ టీమ్గా గుర్తింపు పొందిన వారిపై ఆ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. అధికార ప్రతినిధి లంక దినకర్తోపాటు మరో ముగ్గురి నేతలకు బీజేపీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా హాట్టాపిక్గా మారింది.
ఏపీ బీజేపీ పరిణామాలను చూస్తుంటే ఆ పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో నిర్దిష్ట కార్యచరణ అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్షుడి మార్పుతో ఊరుకోకుండా వెనువెంటనే కొంతమంది నాయకులపై షోకాజ్ అస్త్రాలను ప్రయోగించిందంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో బీజేపీ వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఇబ్బడిముబ్బడిగా బీజేపీ, వైఎస్సార్సీపీలో చేరిపోతున్నారు. ఈ జాబితాలో రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వంటి వారు ఉన్నారు. అలాగే లంక దినకర్ వంటి ద్వితీయ శ్రేణి నాయకులూ పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. కానీ, సుజనా, సీఎం రమేష్, లంక దినకర్ వంటి వారు బీజేపీలో చేరినప్పటికీ టీడీపీ జెండా, అజెండాలనే మోస్తున్నారనే అపవాదను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.
బీజేపీలో ఉంటూ సొంత పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారికి టీడీపీ బీ టీమ్గా ముద్రపడింది. అయితే తాజాగా టీడీపీ అనుకూలంగా, చంద్రబాబు నాయుడు వ్యూహాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడనే ముద్రపడిన కన్నా లక్ష్మీనారాయణ తొలగింపు….చంద్రబాబుపై ఘాటుగా స్పందిస్తాడనే ఇమేజ్ ఉన్న సోము వీర్రాజు నియామకం బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీని ఢీకొట్టడం అంత తేలికైన విషయం కాదు. ఇది గుర్తించిన బీజేపీ ముందుగా టీడీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే టీడీపీని ఇరుకున పెట్టగల సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలను అప్పగించింది.
ఇక లంక దినకర్ షోకాజ్ విషయానికొస్తే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి స్పష్టమైన హెచ్చరికగా కనిపిస్తోంది. గీత దాటితే వేటు తప్పదనే సూచనలు ఇచ్చినట్లయింది. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో లంక దినకర్ బీజేపీలో చేరారు. ఆయన్ను ఆ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించింది. అయితే టీడీపీ పల్లవి పాడే ఛానెళ్ల చర్చల్లో పాల్గొంటున్న దినకర్ పార్టీ విధానాలకు భిన్న వైఖరిని వినిపిస్తూ వస్తూన్నారు. దీంతోపాటు పార్టీ అంతర్గత వివరాలను టీడీపీకి చేరవేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో బీజేపీ ఆయనకు షోకాజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే రాబోయే రోజుల్లో గుండెల నిండా టీడీపీనే నింపుకున్న బీజేపీ నేతలకు కష్టకాలమే అని చెప్పక తప్పదు.