iDreamPost
iDreamPost
దక్షణ కోస్తా జిల్లాలకు దెబ్బ మీద దెబ్బ తగలనుంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది కాస్తా తుఫానుగా మారి దక్షణ కోస్తాంధ్రలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. అండమాన్ నికోబార్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి ముందు వాయుగుండంగాను, తరువాత తుఫానుగా మారనుంది. ఈనెల 17న ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో తీరం దాట నుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి గురువారం చెన్నై సమీపంలో తీరం దాటిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో రెండు రోజులుగా తమిళనాడు, ఆంధ్రాలలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వర్షాలతో అతలాకుతలమైన చెన్నై, తమిళనాడులోని చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, ఆంధ్రాలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల వాసులు తాజా తుఫాను హెచ్చరికలతో మరింత ఆందోళన చెందుతున్నారు.
చిగురుటాకులా వణుకుతున్న చెన్నై:
చెన్నై మహానగరం చిగురుటాకులా వణుకుతుంది. వాయుగుండం కన్నా ముందే ఈ నగరం భారీ వర్షాలకు ముంపులో చిక్కుకుంది. దీనికి వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు నగరం మరింత ముంపులో చిక్కుకుంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు 22 గంటల పాటు ఏకథాటిగా కురిసిన వర్షంతో నగరం అతలాకుతలమైంది. రహదారులు కాలువలుగాను, లోతట్టు ప్రాంతాల కాలనీలు చెరువులుగా మారిపోయాయి. ఇళ్లు, కార్యాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలు ముంపుబారిన పడ్డాయి. వర్షాల వల్ల 14 మంది మృతి చెందినట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలకు ఇచ్చిన సెలవులను పొడిగించారు. ముంపులో చిక్కుకున్నవారిని పడవల మీద, ట్రాక్టర్ల మీద తరలిస్తున్నారు. బాధితులకు పడవల మీద పాలు, ఆహారం సరఫరా చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సహాయ పునరావస పనులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
నెల్లూరు. చిత్తూరు జలమయం:
వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో నెల్లూరు, చిత్తూరు అతలాకుతలమైయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో 10 నుంచి 18 సెం.మీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు, చిత్తూరులో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. పలు లోతట్టు కాలనీలు, రోడ్లు ముంపుబారిన చిక్కుకున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడుతుండడంతో గురువారం మధ్యాహ్నం నుంచి రాకపోకలు నిలిపివేశారు. కాలువలు, చెరువులు పొంగి కాలనీలను, రోడ్లను ముంచెత్తుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో సైతం భారీ వృక్షాలు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరుపతిలో విమానాల రాకపోకలను తాతాల్కికంగా నిలిపివేశారు. చెన్నై ` తిరుపతి మధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కోస్తా వెంబడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వేల ఎకరాల్లో వరిచేలు ముంపుబారిన పడ్డాయి.
తక్షణ సాయం రూ.వెయ్యి:
ముంపుబాధితులకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆపన్న హస్తం అందించారు. గురువారం ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ముంపుబారిన పడిన బాధితులకు ఆహారం, నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.వెయ్యి ప్రకటించారు. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆహారం, తాగునీటి ప్యాకెట్ల పంపిణీ, వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.
Also Read : Heavy Rains, AP – తూర్పు తీరం అతలాకుతలం.. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం జగన్