iDreamPost
android-app
ios-app

హెరిటేజ్ ఇక పక్క రాష్ట్రాలకు పయనమవ్వాల్సిందేనా?

హెరిటేజ్ ఇక పక్క రాష్ట్రాలకు పయనమవ్వాల్సిందేనా?

కార్పోరేట్ పడగ నీడలో కూలిన జీవితాలను లెక్కగట్టడం కష్టం. అన్ని రంగాల్లోనూ కార్పోరేట్ సంస్థల ఆధిపత్యమే కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగ డెయిరీలను కార్పోరేట్లతో పోటీకి నిలబెట్టే ప్రయత్నాన్ని ఆరంభించింది. ఆంధ్రరాష్ట్రంలో ఒకప్పుడు రైతాంగానికి ప్రధాన ఆధాయ వనరుగా నిలిచిన సహకార రంగ డెయిరీలు కార్పోరేట్ల రాకతో కుప్పకూలిపోయాయి. వాటికి పునర్ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ సర్కారు ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు డెయిరీలు ప్రమాదంగా భావిస్తున్నాయి.

ప్రముఖ సహకార డెయిరీ అమూల్ ద్వారా రాష్ట్రంలో పాల సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాల ఉత్పత్తుల తయారీ రంగంలో అగ్రగామి సంస్థ అమూల్. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఈ సంస్థలో 36 లక్షల మంది పాల ఉత్పత్తిదారులు భాగస్వామ్యులుగా ఉన్నారు. విదేశాలకు సైతం విస్తరించిన ఈ సంస్థతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో ప్రభుత్వమే పాలసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. తొలి దశలో 250 గ్రామాల్లో ఆరంభమైన పాల సేకరణను క్రమంగా రాష్ట్రమంతా విస్తరించనుంది.

సహకార డెయిరీల బలోపేతం

ఆంధ్రప్రదేశ్ రాష్రంలో పాల మిగులు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చేయూత పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఆర్థిక సహాయంతో పాల ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంది. వాటికోసం రాష్ట్ర వ్యాప్తంగా పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మూడదశల్లో వీటిని నిర్మించే వీటికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,231 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 7వేలకు పైగా పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల రాష్ట్రంలో పోటీ పెరగడం ద్వారా పాలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రైవేటు డెయిరీలు రైతులు కోరిన ధర చెల్లించక తప్పని స్థితి ఏర్పడుతుంది. అమూల్ రాకతో ప్రభుత్వ రంగంలోని డెయిరీల బలోపేతానికి మార్గం సుగమం అవుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో సహకార డెయిరీల నిర్వహణ వల్ల పాల ఉత్పత్తి రంగంలో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడతాయంటున్నారు. సహకార డెయిరీలు బలోపేతం కావడం వల్ల పాడి పరిశ్రమ వృద్ధి చెందుతుందంటున్నారు. ఇప్పటికే అమూల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాల్లో పాల సేకరణను ప్రారంభించారు. గతంలో 10శాతం ఫ్యాట్ ఉన్న లీటర్ పాలకు కేవలం 58 రూపాయలు లభించేవి. ఇప్పుడు ఆ ధర 65 రూపాయలకు పెరిగింది. అమూల్ రాకతో రైతులకు ఆధాయం అనూహ్యంగా పెరిగింది. ప్రభుత్వం ఆరంభించిన ఈ ప్రయత్నంతో ప్రైవేటు డెయిరీల్లో కలవరం మొదలైంది.

హెరిటేజ్ మాయ

చంద్రబాబు నాయుడు 1992లో హెరిటేజ్ డెయిరీని ప్రారంభించారు. పరస్పర సహాయ సహకార సంఘాల చట్టాని తెచ్చి జిల్లాల డెయిరీలను ఆ పరిధిలో తెచ్చారు. క్రమంగా… విశాఖ, గుంటూరు, ప్రకాశం సహకార సంఘాలను కంపెనీల కిందకు మార్చేశారు. హెరిటేజ్ కోసమే చిత్తూరు డెయిరీని మూసేశారనే ఆరోపణలూ ఉన్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని రైతులు హెరిటేజ్ డెయిరీకే పాలు పోసేలా ఒత్తిడి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. క్రమంగా సహకార డెయిరీల స్థానంలో ప్రైవేటు సంస్థల పెత్తనాన్ని పెంచారు. రెండు దశాబ్దా్ల్లో హెరిటేజ్ అతిపెద్ద పాల ఉత్పత్తుల సంస్థగా మారింది.

తెలుగుదేశం పార్టీ హయాంలో హెరిటేజ్ కు లాభాలు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రన్న కానుక, క్రిస్మస్, రంజాన్ కానుకల పేరుతో హెరిటేజ్ నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే ఉత్పత్తులను అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిందనే ఆరోపణలున్నాయి. షేర్‌ రిగ్గింగ్‌ ద్వారా హెరిటేజ్‌ షేర్‌ ధరను భారీగా పెంచిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో సహకార డెయిరీలను దెబ్బతీసి, వాటికి పోటీగా మార్కెట్లోకి ప్రైవేటు డెయిరీలు ప్రవేశించాయి. వాటిల్లో హెరిటేజ్, సంగం, విశాఖ లాంటి సంస్థలు ప్రధానమైనవి. ఇలాంటి ప్రైవేటు సంస్థల దోపిడీని కట్టడి చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సహకార డెయిరీల బలోపేతాన్ని ప్రైవేటు డెయిరీల ధ్వంసంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

పక్క రాష్ట్రాలకు పయనం

అమూల్ రాకతో తమకెలాంటి నష్టం లేదంటూనే ఇక్కడ పాలు తగ్గితే తాము ఇరత రష్ట్రాలకు వెళ్లి కొనుగోలు చేస్తామని చెప్పుకొచ్చారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తాము రైతులకు నష్ట చేయనట్లయితే వారికి గిట్టుబాటు ధరను చెల్లించడానికి సిద్ధపడాల్సింది పోయి పక్క రాష్ట్రాలకు వెళ్తామనడంలోనే అసలు ఆంతర్యం ఉంది. ఇంతకాలం తమకు పోటీ లేకపోవడం వల్ల హెరిటేజ్ లాంటి ప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారంగా రైతులను దోపిడీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో దిక్కుతోచని స్థితికి చేరిన ఆ సంస్థలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సహకార డెయిరీల బలోపేతాన్ని ఈ ప్రైవేటు సంస్థలు హర్షించకపోవడంలోనే వాటి లాభాలకు గండిపడుతుందనే బాధ కనిపిస్తోంది. మొత్తానికి ఇంతకాలం రాష్ట్ర ప్రజలనుంచి లక్షల లీటర్ల పాలను తక్కువ ధరకు సేకరించిన హెరిటేజ్ సంస్థ కన్ను ఇప్పుడు పక్క రాష్ట్రాలపై పడింది. మరి అక్కడైనా రైతులకు న్యాయం చేస్తారో లేదో చూడాలి.