iDreamPost
iDreamPost
‘మాటల్లో కత్తులు… లోలోన పొత్తులు’ అన్నట్టుగా సాగుతున్న టీడీపీ, జనసేన మైత్రికి ఉప్పు` నిప్పుగా కొట్టుకునే బీజేపీ, సీపీఎంలు కూడా లోపాయకారి మద్దతు ఇస్తున్నాయా? అంటే అవునంటున్నారు ఆకివీడు నగర పంచాయతీ ఓటర్లు. ఇక్కడ జరుగుతున్న నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన అనధికారికంగా పొత్తు పెట్టుకున్నారు. ఈ రెండు పార్టీలు వార్డులు పంచుకుని అందుకు తగినట్టుగా అభ్యర్థులను బరిలో నిలిపారు. వీరితో రెండు వార్డులను కమ్యూనిస్టు పార్టీ సీపీఎం, ఒక వార్డు నుంచి బీజేపీ పోటీ చేస్తూ అనధికారంగా కూటమి కట్టడం చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎన్నికల్లో ఎత్తులు.. పొత్తులు సర్వసాధారణం. కాని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య కుదిరిన పొత్తులు చూసి సామన్యులు సైతం ఔరా ఇదేమి చోద్యం అని అనుకుంటున్నారు. గత సాధారణ ఎన్నికల నుంచి టీడీపీ మీద ఒంటికాలి మీద లేచే బీజేపీ నాయకులు ఇక్కడ టీడీపీ, జనసేన అనధికార కూటమికి మద్దతు ఇస్తుండడం ఒక విచిత్రం. ఈ కూటమిలో కమ్యూనిస్టులు కూడా ఉండడం మరో విచిత్రం. బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని కమ్యూనిస్టులు.. కమ్యూనిస్టులంటే దేశద్రోహులని బీజేపీ నేతల గల్లీ నుంచి ఢిల్లీ వరకు రోజూ తన్నుకుంటూనే ఉంటారు. అటువంటి పార్టీలన్నీ కలిసి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు జట్టు కట్టడం ద్వారా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని నానుడి నిజం చేశారు.
Also Read : JC Prabhakar Reddy Hug, Paritala Sriram – జేసీ రాజకీయం.. ఆత్మీయమా..? అవసరమా..?
ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో 20 వార్డులకు గాను టీడీపీ 13 వార్డుల్లో పోటీ చేస్తుంది. జనసేన 6, సీపీఎం 2, బీజేపీ 1 చోట పోటీ పడుతున్నారు. తమ మధ్య పొత్తు లేదని చెప్పుకునేందుకు కనీసం డమ్మీ అభ్యర్థులనైనా నిలపాలనే ఆలోచన కూడా ఒక్క పార్టీకి కూడా లేదు. టీడీపీ 3వ వార్డుతోపాటు 4, 5, 7, 8, 9, 11, 12, 14, 15, 16, 18, 19 వార్డులలో పోటీకి అభ్యర్థులను నిలిపింది. జనసేన 2వ వార్డుతోపాటు 6, 10, 17, 20 వార్డుల్లో అభ్యర్థులను నిలిపారు. సీపీఎం 13, 14 వార్డులలో పోటీలో నిలిచింది. ఇక బీజేపీ 1వ వార్డుకు మాత్రమే పరిమితమైంది. కేవలం 14 వార్డు ఒక్కదానిలో మాత్రమే సీపీఎంతోపాటు టీడీపీ పోటీలో ఉంది. మిగిలిన ఏ వార్డులో కూడా ఒకరికి మరొకరు పోటీలో లేకుండా లోపాయకారి ఒప్పందం చేసుకుని అందుకు తగినట్టుగా అభ్యర్థులను బరిలో నిలపడం విశేషం.
ఇక్కడ తమ బద్ధశత్రువు టీడీపీతో తమ మిత్రపక్షం జనసేన పొత్తు పెట్టుకున్నా బీజేపీ కిమ్మనడం లేదు. ఇంత చేసినా కేవలం ఒక్క వార్డుకు మాత్రమే పోటీలో ఉండడం ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేనాని సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో ఎంత దొడ్డిదారి పొత్తు పెట్టుకున్నా కేవలం ఐదు వార్డులకు మాత్రమే పార్టీని పరిమితం చేయడంపై అటు జనసైనికులు సైతం పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో ఉప్పు`నిప్పుగా ఉండే బీజేపీ, సీపీఎంలు ఒకటి, రెండు సీట్లు కోసం నవ్విపోదురు మాకేమి సిగ్గు అన్నట్టుగా కలిసిపోవడం చూసి సామాన్య ఓటర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
Also Read : NTR, Chandrababu, Yanamala – యనమల చెబుతున్నారు నమ్మండి.. జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారట..!