iDreamPost
android-app
ios-app

త్యాగానికి జగన్ పట్టం : కడప జడ్పీ చైర్మన్ గా ఆకేపాటి

త్యాగానికి జగన్ పట్టం : కడప జడ్పీ చైర్మన్ గా ఆకేపాటి

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాలకు సంబంధించిన జడ్పీ చైర్మన్ పదవులను అధికార పార్టీకి చెందిన సీనియర్ నేతలు అధిష్టించారు. 13 జిల్లాలో అధికార పార్టీ సత్తా చాటింది. వైసీపీ కార్యకర్తల కష్టం, నేతల అండదండలతో దాదాపు 13 జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జడ్పీ చైర్మన్ గా ఎవరు ఎన్నిక కాబోతున్నారు అనే అంశం ముందు నుంచి చర్చనీయాంశంగా మారింది. అయితే ముందు నుంచి వినిపించిన పేరునే వైఎస్ జగన్ ఖరారు చేశారు.

Also Read : తూర్పు జెడ్పీ పీఠంపై ‘వేణు’గానం 

వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వైసీపీ సీనియర్ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గనుక మనం చూసినట్లయితే ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలతో వైఎస్ జగన్ కు అండగా 2012లో వైసీపీలో చేరిన ఆయన ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ సమయంలో ఆయన కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి మేడా మల్లికార్జున్ రెడ్డి చేతిలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

Also Read : నాడు ఎమ్మెల్యే పదవి మిస్ ,నేడు జడ్పీ చైర్మన్ 

అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల సమయానికి టిడిపి నుంచి మేడా మల్లికార్జున్ రెడ్డి వచ్చి వైసీపీలో చేరడంతో ఆకేపాటి కి టికెట్ లభించలేదు, అయితే ఆ సమయంలో కాస్త అసహనానికి గురైనా సరే వైఎస్ జగన్ ను పల్లెత్తు మాట అనకుండా ఆయనకు విధేయుడు గానే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉంటూ వచ్చారు. అమర్నాథ్ రెడ్డికి గతంలో టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా అది ప్రచారానికి మాత్రమే పరిమితం అయింది. టికెట్ నిరాకరించినా తనతోనే కలిసి నడుస్తున్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి వైయస్ జగన్ కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే టిక్కెట్ త్యాగానికి ఫలితం అమర్ నాథ్ రెడ్డికి ఇలా దక్కింది.

Also Read : మాజీ ఎమ్మెల్యే శ్రీమతికి సిక్కోలు జెడ్పీ పీఠం