iDreamPost
android-app
ios-app

ధనుష్ – ఐశ్వర్యల 18 ఏళ్ల వివాహబంధానికి ముగింపు

ధనుష్ – ఐశ్వర్యల 18 ఏళ్ల వివాహబంధానికి ముగింపు

సినీ పరిశ్రమలో వరుసగా విడాకుల వార్తలు బయటకి వస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య,సమంత విడాకుల వ్యవహారం ఇంకా చర్చలో ఉండగానే ఈసారి తమిళ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ ఊహించని ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. స్టార్ హీరోగా తనదైన శైలిలో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకు విడాకులు ప్రకటించారు. ఈ విషయాన్ని వారిద్దరూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించారు.

సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరు విడిపోతున్నట్లు ప్రకటించడంతో ఈ వ్యవహారం వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చింది.

ధనుష్ కస్తూరిరాజా కుమారుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కి విడుదలైన ‘కాదల్ కొండెన్'(ఈ సినిమాను అల్లరి నరేష్ హీరోగా నేను పేరుతో తెలుగులో కూడా చేశారు)అనే సినిమా కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ధనుష్, ఐశ్వర్య మధ్య పరిచయం ఏర్పడింది. నెమ్మదిగా ఆ పరిచయమే వీరి ప్రేమకు దారి తీసింది. దీంతో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే వరకు వెళ్లింది. ఆ తర్వాత చాలా అన్యోన్యంగా ఉంటూ వచ్చారు.వీరి ప్రేమకు గుర్తుగా యాత్ర రాజా, లింగ రాజా అనే ఇద్దరు మగ పిల్లలు కూడా జన్మించారు. వారిలో యాత్ర రాజా వయసు 15 సంవత్సరాలు కాగా లింగ రాజా వయసు 11 సంవత్సరాలు.

“18 ఏళ్ల పాటు స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరికొకరు కలిసిమెలిసి ప్రయాణం సాగించాం, మా ప్రయాణం ఎదుగుదల, అవగాహన, సర్దుబాటు, అనుకూలతలతో సాగింది.. ఈరోజు దారులు వేరవుతున్నట్టు ఐశ్వర్యకు నాకు అనిపిస్తోంది. జంటగా విడిపోయి, మమ్మల్ని అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి అని నిర్ణయించుకున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి మరియు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రైవసీ మాకు అందించండి. ఓం నమశివాయ! అంటూ ధనుష్ పేర్కొన్నారు. దాదాపు ఇదే సందేశాన్ని ఐశ్వర్య కూడా చివరిలో తన పేరుతో పంచుకున్నారు. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య కూడా మొదటి భర్తకు విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకున్నారు.