ప్రేమకోసం సినిమాల్లో హీరోలు చేసే సాహసాల్ని చూసి చప్పట్లు కొడతాం. దాదాపు అదే ప్రయత్నం చేసి వార్తల్లో నిలిచాడు ఓ యువకుడు.. ఏకంగా మన శత్రు దేశమైన పాకిస్తాన్ లోకి అడుగుపెట్టేందుకు విఫలయత్నం చేసాడు. పాకిస్తాన్ సరిహద్దుల్లోకి అడుగుపెట్టి చావు అంచుల వరకూ వెళ్ళాడు..
వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ టౌన్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిషాన్ మహమ్మద్ సిద్ధిఖి అనే యువకుడికి ఫేస్బుక్ లో పాకిస్తాన్లోని కరాచీకి చెందిన సమన్రా అనే యువతితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య పరిచయం బాగా పీరైగి ప్రేమగా మారింది. దాంతో ఎలాగైనా పాకిస్తాన్ వెళ్లి సమన్రాను కలవాలని జిషాన్ మహమ్మద్ సిద్ధిఖి నిర్ణయించుకున్నాడు.
అందులో భాగంగా బైక్ పై గుజరాత్ లోని పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ క్రమంలో బైక్ రిపేర్ కావడంతో కాలినడకన సరిహద్దు దాటడానికి ప్రయత్నించాడు. ఇందుకు గూగుల్ మ్యాప్స్ సహాయం తీసుకున్నాడు. కానీ సరిహద్దులో డిప్రెషన్ కారణంగా స్పృహ కోల్పోయాడు. యువకుడిని గమనించిన బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకుని వివరాలు తెలుసుకున్నారు.
కాగా యువకుడి వివరాలను తెలుసుకున్న అధికారులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే సిద్ధిఖి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దాంతో యువకుడిని మహారాష్ట్రలో ఉన్న తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు.