iDreamPost
iDreamPost
అవి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. అప్పటికే మన దేశాన్ని ఏలుతున్న బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆ యుద్ధంలో పాల్గొంటోంది. అదే సమయంలో భారత మాతను వలస పాలకుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించేందుకు దశాబ్దాలుగా పోరాడుతున్న స్వాతంత్ర్య సేనానులు బ్రిటిష్ ప్రభుత్వంపై సమర శంఖం పూరించారు. క్విట్ ఇండియా అంటూ బ్రిటీషర్లపై తిరుగుబాటు ప్రకటించారు. 1942 ఆగస్ట్ ఎనిమిదో తేదీన ఉద్యమానికి ప్రాణం పోశారు. దేశ స్వాతంత్ర్యానికి ఊపిరులూదిన క్విట్ ఇండియా ఉద్యమం నేటితో 79 ఏళ్లు పూర్తి చేసుకొని 80వ వసంతంలోకి అడుగుపెట్టింది. బ్రిటీషర్లు అమలు చేసిన తీవ్ర అణచివేత, నిర్బంధాలను ఎదురొడ్డి సమరయోధులు మూడేళ్లపాటు ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించడంతో చివరికి బ్రిటిష్ పాలకులు తోకముడవక తప్పలేదు.
ముంబై సభలో పురుడు
అప్పటికే ఎన్నో రూపాల్లో దశాబ్దాల తరబడి జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమం 1942 ఆగస్ట్ ఎనిమిదో తేదీన కీలక మలుపు తిరిగింది. ఆ రోజు ముంబైలోని కోవాలియా ట్యాంక్ మైదానంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో మహాత్మాగాంధీ డూ ఆర్ డై అని నినదించారు. ‘సాధించు లేదా మరణించు’ అంటూ దేశ ప్రజలకు కొత్త నినాదం ఇచ్చారు. ఆ నినాదంతో బ్రిటిష్ పాలకులను తరిమికొట్టేందుకు నిరంతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం కోసం ప్రపంచాన్నయినా ఎదిరిద్దాం.. కానీ వెనుకడుగు మాత్రం వేయవద్దని సందేశమిచ్చారు. వలస పాలకులను తరిమికొట్టే వరకు విశ్రమించవద్దన్నారు. అదే సమావేశంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమర యోధుడు యూసుఫ్ మెహర్ అలీ ఈ పోరాటానికి క్విట్ ఇండియా ఉద్యమంగా నామకరణం చేశారు. అయితే హిందూ మహాసభ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ముస్లిం లీగ్ దీన్ని వ్యతిరేకించాయి. అయినా సమర యోధులు వెనుకంజ వేయలేదు. డూ ఆర్ డై, క్విట్ ఇండియా నినాదాలతో దేశం మొత్తాన్ని హోరెత్తించారు.
బ్రిటిష్ ప్రభుత్వ దమన కాండ
ఆగస్ట్ 8న మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం త్వరలోనే దేశమంతా విస్తరించి ఉద్ధృత రూపం దాల్చడంతో బ్రిటిష్ పాలకులు దామనకాండకు దిగారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించారు. దాంతో అహింసా విధానంలో సాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఉద్యమకారులను అరెస్టు చేయడం, నిర్బంధాలకు గురిచేయడం వంటి అణిచివేత విధానాలు ఎంత మాత్రం ఫలితం చూపలేదు. ఇక లాభం లేదని ప్రముఖ నాయకులతో సహా ఉద్యమకారులను దొరికిన వారిని దొరికినట్లు తీసుకెళ్లి జైళ్లలో పెట్టారు. అలా సుమారు పదివేల మంది మూడేళ్లపాటు జైళ్లలో మగ్గిపోయారు. క్విట్ ఇండియా ఉద్యమం తక్షణ ఫలితం సాధించలేకపోయినా ప్రజలను జాగృతం చేసింది. బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. కొంత దిగివచ్చిన పాలకులు భారతీయులకు కొన్ని అధికారాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.
అయితే భారతీయ నేతలు అంగీకరించకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. ఉద్యమం జరుగుతున్న తీరును.. భారత ప్రజల స్వేచ్ఛా పిపాసను గమనించిన నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దానికితోడు రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన బ్రిటిష్ పాలకులు భారత ప్రజల ఉద్యమాలను ఇంకెంతో కాలం కట్టడి చేయలేమని గ్రహించారు. ఆ మేరకు దేశం విడిచి వెళ్లేందుకు మెల్లగా చర్యలు ప్రారంభించారు. చివరికి 1947 ఆగస్ట్ 14 అర్థరాత్రి దేశానికి స్వాతంత్య్రం ప్రకటించి.. నిష్క్రమించారు. అలా క్విట్ ఇండియా ఉద్యమం వలస పాలకుల తిరోగమనానికి నాంది పలికింది.