iDreamPost
android-app
ios-app

ఏపీ హైకోర్టులో 16 మందికి కరోనా… ప్రధాన న్యాయమూర్తి కీలక నిర్ణయం

ఏపీ హైకోర్టులో 16 మందికి కరోనా… ప్రధాన న్యాయమూర్తి కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 16 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. గత బుధవారం హైకోర్టు రిజిస్ట్రార్‌ రాజశేఖర్‌ కరోనా వైరస్‌ వల్ల హఠాన్మరణం చెందారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు కార్యకలాపాలను ఈ నెల 28వ వరకూ, ఆ తర్వాత 30వ తేదీ వరకు నిలిపివేశారు. హైకోర్టుతోపాటు దానికి అనుబంధంగా పని చేసే విజయవాడ, మచిలీపట్నంలలోని సెనెన్స్‌ కోర్టు కార్యకలాపాలు కూడా నిలిపివేశారు.

హైకోర్టులోని న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేకమైన బస్సు హైకోర్టు వద్దకే వెళ్లి స్వాబ్‌ టెస్ట్‌లు చేసింది. ఈ పరీక్షలు ముగిశాయి. ఫలితాల్లో 16 మందికి పాజిటివ్‌ వచ్చిందని ఈ రోజు వెల్లడైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినయ్‌ మహేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు నేటితో హైకోర్టుకు ఇచ్చిన సెలవులు ముగిశాయి. అయితే బుధవారం కూడా హైకోర్టు కార్యకలపాలను నిలిపివేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. హైకోర్టుతోపాటు అనుబంధ కోర్టులకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైన పిటిషన్లు ఉంటే ఆన్‌లైన్‌లో దాఖలు చేసుకోవాలని సూచించారు.