iDreamPost
android-app
ios-app

పంపిణీ సరే… టీకాలు ఏవీ మోడీజీ..?

  • Published Apr 27, 2021 | 8:20 AM Updated Updated Apr 27, 2021 | 8:20 AM
పంపిణీ సరే… టీకాలు ఏవీ మోడీజీ..?

” తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ”.. అని బద్దెన తన సుమతీ శతకంలో ఆనాడే చెప్పారు. నిజానికి ఈ పద్యం ప్రధాని నరేంద్ర మోడీకి సరిగ్గా సరిపోతుంది. అంతా అనుకూలంగా ఉన్నపుడు గొప్పలు చెప్పడం.. పరిస్థితి చేయి దాటాక పక్కకు తప్పు కోవడం ఆయన ముందు నుంచీ చేస్తున్నదే. ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ‘తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి’ అన్న రీతిలో.. ఉత్తర్వులు ఇచ్చాం.. వ్యాక్సిన్ వేయండి అని చెబుతున్నారు. టీకా సరఫరా బాధ్యత నుంచి తప్పుకున్నారు.

18 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ వేస్తామని ఇటీవల ప్రకటించారు. కానీ ఇందుకు అయ్యే ఖర్చును పరోక్షంగా రాష్ట్రాల మీదకు నెట్టారు. తమ రాష్ట్ర ప్రజల కోసం వ్యాక్సిన్ కు అయ్యే ఖర్చును భరించేందుకు దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. కంపెనీలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ డోసులన్నీ మే చివరి దాకా కేంద్రానికి సరఫరా చేసేందుకే సరిపోతాయి. మరి అలాంటప్పుడు రాష్ట్రాలకు ఎలా సరఫరా చేస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

నిజం ఇదీ.. 

దేశవ్యాప్తంగా 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి మే 1 నుంచి వ్యాక్సిన్‌ వేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్రాలు ఇందుకు సిద్ధంగా ఉన్నా.. వ్యాక్సిన్ తయారు చేసే సంస్థల ఉత్పత్తి సామర్థ్యం పెరగలేదు. అవి ఉత్పత్తి చేస్తున్న టీకా డోసులు.. కేంద్రానికి సరఫరా చేయడానికే సరిపోడం లేదు. ఈ మధ్య చాలా చోట్ల టీకాల కొరత ఏర్పడటం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బయటికి చెప్పడం లేదు. ఉత్తర్వులు ఇచ్చి చేతులు దులుపుకొంది. తాము వ్యాక్సినేషన్ కు రెడీగానే ఉన్నా.. తమకు సరఫరా లేదని రాష్ట్రాలు చెపుతున్నాయి. ఇదే విషయాన్ని ఏపీ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.. లెక్కలతో సహా వివరించారు

“ప్రస్తుతం రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సులో 2.4 కోట్ల మంది ఉన్నారు. వీరందరికి వ్యాక్సిన్‌ అందించాలంటే 4.8 కోట్ల డోసులు అవసరం. ఇప్పటికే వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలతో మాట్లాడాం. కొన్ని కంపెనీలు సరఫరాకు ముందుకొచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే అవి వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి. కంపెనీలు తయారు చేసిన డోసుల్లో సగం కేంద్రానికే ఇవ్వాల్సి ఉంది. మిగిలిన వాటిని ప్రైవేటు రంగానికి, రాష్ట్రాలకు అందించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మే నెలాఖరు నుంచి జూన్‌ వరకూ కంపెనీలన్నీ కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేయడానికే వ్యాక్సిన్‌ సరిపోతుంది. అది పూర్తయితే తప్ప రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ ఇచ్చే పరిస్థితి లేదు’’ అని అసలు సంగతిని సింఘాల్ కుండ బద్దలు కొట్టేశారు.

Also Read : దేశం మునుగుతోంది మోడీ గారు..! ఎలాగంటే..?

వాళ్ళు అప్పుడే అన్నారు..

టీకాల సరఫరా లేనప్పుడు 18 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సినేషన్ ఎలా ప్రారంభిస్తామని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న ఛత్తీస్ ఘడ్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు నిలదీశారు. “మే 15 వరకు టీకాలను సరఫరా చేయలేమని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తేల్చిచెప్పింది. ఇక 18 నుంచి 45 ఏళ్ల వయసు వాళ్లకు వ్యాక్సిన్ ఎలా ఇవ్వగలం” అని ప్రశ్నించారు. నిజమే కదా మరి. 45 యేళ్లు పైబడిన వాళ్ళలో చాలా మందికి ఇంకా సెకండ్ డోసు వేయలేదు. టీకా వేయించుకునేందుకు వెళ్తే నో స్టాక్ బోర్డులు దర్శనం ఇప్పటికీ ఇస్తున్నాయి.

వలస కూలీల విషయంలోనూ ఇంతే

గతేడాది కరోనా మొదలైన కొత్తలో ఉన్నట్టుండి లాక్ డౌన్ ప్రకటించారు. జనాలపై ముఖ్యంగా వలస కూలీలపై సర్జికల్ స్ట్రైక్ చేశారు మోడీ. పని దొరక్క, తిండి లేక వేలాది మంది వలస కూలీలు అల్లాడి పోయారు. కానీ వీల్ల గురించి పట్టించుకోలేదు. దీంతో వాళ్లు అక్కడే ఉండలేక సొంత ఊళ్లకు బయలుదేరారు. కానీ రవాణా సదుపాయం లేకపోవడంతో లక్షలాది మంది నడిచి వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళ కోసం రైళ్లు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు అయ్యే ఖర్చును మాత్రం రాష్ట్రాలపై మోపింది. వలస కూలీలను తరలించేందుకు రైళ్లు ఏర్పాటు చేశామని ప్రకటించుకుని.. తరలింపు భారాన్ని మాత్రం దించేసుకున్నాయి. పేరు కేంద్రానికి.. ఖర్చు రాష్ట్రాలకు.. బాధలు వలస కూలీలకు. చాలా చోట్ల స్థానిక అధికారులే రైళ్ల ఖర్చులు భరించారు. బ్యాంకులకు ఆర్థిక నేరగాళ్లు చేసిన వేల, లక్షల కోట్లు అప్పులను మాఫీ చేసిన కేంద్రం.. వలస కూలీలు తరలింపునకు మాత్రం ప్రతి పైసా వసూలు చేసింది.

క్రెడిట్ హైజాకర్..

నరేంద్ర మోడీ పెద్ద క్రెడిట్ హై జాకర్ అనే పేరుంది. యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కలిసి వ్యాక్సిన్ తయారు చేశాయి. దానికి మనదేశంలో “కోవిషీల్డ్‌” అని పేరు పెట్టి పంపిణీ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన కోవాగ్జిన్‌ కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే ఇవి రెండు తమ ప్రభుత్వమే కనిపెట్టింది అన్న రీతిలో ఆయన ప్రచారం చేసుకున్నారు. కోవిషీల్డ్ ను బ్రిటన్ వాళ్ళు తయారు చేస్తే. మేడ్ ఇన్ ఇండియా అంటూ డప్పు కొట్టారు. దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ తగ్గేసరికి.. కరోనాపై గెలిచాం అంటూ సంబరాలు చేసుకున్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరా చేసున్నామంటూ గొప్పలకు పోయారు. తన ఘనతను చెప్పుకునేందుకు…. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలను తక్కువ చేసి మాట్లాడారు. కానీ సెకండ్ వేవ్ దెబ్బకు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అమెరికా, బ్రిటన్ ఊసు ఎత్తడం లేదు. ఎందుకంటే అవి మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి కాబట్టి.

Also Read : తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజ‌న్.. త‌మిళ‌నాడు అభ్యంత‌రం..!