బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా కోస్తా భాగాల్లో పాటు విశాఖపట్నం, విజయనగరంలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. తిరుమల వీధులతో పాటు తిరుపతిలోని అనేక ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి.
Also Read:తెగిన అన్నమయ్య డ్యామ్ ,భయం గుప్పెట్లో సోమశిల ప్రాజెక్ట్
చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తూ ఉండడంతో అనంతపురం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కరువు జిల్లా అనంతపురంపై ప్రకృతి కన్నెర్ర చేయడంతో భారీ ఎత్తున వర్షాలు, వర్షాల దెబ్బకు వరదలు రావడంతో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులన్నీ నిండి సముద్రాలను తలపిస్తూ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
అయితే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నదిలో కారు చిక్కుకు పోయిన ఘటన సంచలనంగా మారింది. చిత్రావతి నదిలో చిక్కుకుపోయిన ఆ కారులో ఐదుగురు ఉండడంతో వారిని రక్షించడానికి జేసీబీలో మరికొంత మంది వెళ్ళారు.అయితే జేసీబీ కూడా నీటిలో చిక్కుకుపోవడంతో ప్రమాదం బారిన మొత్తం 10 మంది పడ్డారు.అయితే అవి రెండూ వరద నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో జేసీబీపై చిక్కుకున్న అందరూ చిగురుటాకులా వణికిపోయారు.వారిని స్థానికులు, అధికారులు తాళ్ల సాయంతో.. విద్యుత్ తీగల సాయంతో రక్షించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. వరద ఉధృతి అధికంగా ఉండటంతో సహాయక బృందాలు వాళ్లని రక్షించేందుకు వీలు కావడం లేదు.
అధికారులు హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నా అది అందుబాటులోకి రాలేదు.దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దృష్టికి ప్రమాద సమాచారం తీసుకువెళ్ళారు అధికారులు.దీంతో వెంటనే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్న 10 మంది గురించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. ప్రమాదంపై వెంటనే స్పందించిన సీఎం జగన్ ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు.ఆయన ఆదేశాలతో అధికారులు హుటాహుటిన బెంగళూరు నుంచి హెలికాప్టర్ రప్పించారు.ప్రమాద సమాచారం తన దృష్టికి వచ్చిన క్షణాల్లోనే ప్రకాష్ రెడ్డి సీఎం జగన్కి తెలపడంతో ఆయన క్షణాల్లోనే వారిని కాపాడేలా ఏర్పాట్లు చేశారు.వరద నీటి నుంచి బయటపడిన వారంతా ప్రకాష్ రెడ్డి,సీఎం జగన్లకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై పది మందిని సురక్షితంగా కాపాడటంపై హర్షం వ్యక్తమౌతుంది.