iDreamPost

ప్లానింగ్ మారుస్తున్న కింగ్ నాగార్జున

ప్లానింగ్ మారుస్తున్న కింగ్ నాగార్జున

గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగార్జునకు ది ఘోస్ట్ ఇచ్చిన షాక్ చిన్నది కాదు. కష్టపడి యాక్షన్ లు స్టంట్లు గట్రా చేస్తే ఆడియన్స్ నుంచి తిరస్కారమే ఎదురయ్యింది. అంతకు ముంచు బంగార్రాజు హిట్టనిపించుకున్నా అందులో చైతు ఉన్నాడు కాబట్టి పూర్తిగా కింగ్ కే క్రెడిట్ ఇవ్వలేం. ఇక వైల్డ్ డాగ్ చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడం అభిమానులను కలవరపరుస్తోంది. కంటెస్టెంట్స్ విషయంలో ఛానల్ అజాగ్రత్తతో పాటు గేమ్ ని ఆసక్తికరంగా మలచడంతో టీమ్ వైఫల్యం కావడం బిగ్ బాస్ ఆరో సిరీస్ ని ఫ్లాప్ చేసింది. ఈ ఫలితం ఊహించనిది

దీంతో నాగార్జున తన ప్లానింగ్ ని పూర్తిగా మార్చుకోబోతున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే వరసగా దర్శకులు రచయితలతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ముందు లైన్ లో ఉన్నది మోహన్ రాజా. నాగ్ అఖిల్ ని పెట్టి మల్టీ స్టారర్ తీయాలని ఆయన ఆలోచన. కొంత కాలం క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి గాడ్ ఫాదర్ ని డీల్ చేసిన తీరుకు ప్రశంసలు రావడంతో ఈ కాంబో ఖాయమని ఫ్యాన్స్ అనుకున్నారు. తీరా చూస్తే ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదట. బెజవాడ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేసే ప్రతిపాదన కూడా నాగ్ వద్ద ఉంది. మలయాళం సూపర్ హిట్ పురంజు మరియం జోస్ ని తెలుగీకరించే బాధ్యతలు అతనికి అప్పజెప్పారని టాక్

వీళ్ళు కాకుండా మనం ఫేమ్ విక్రమ్ కుమార్ కూడా ఒక కథను వినిపించే ప్రయత్నంలో ఉన్నారు. నాగ చైతన్యతో తీసిన థాంక్ యు దారుణంగా బోల్తా కొట్టడంతో ఇదే కాంబోలో తీసిన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ దూతని విడుదల చేయకుండా కొంత ఆలస్యం చేస్తున్నారు. మనం లాంటి మెమొరబుల్ మూవీ ఇచ్చిన దర్శకుడిగా అతని మీద నాగ్ కు మంచి గురి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిల్లో తన నేరేషన్ తో మెప్పిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఓ పీరియాడిక్ డ్రామా చేసే ప్లాన్ కూడా నాగ్ వద్ద ఉంది. నాకో నెల ఆగితే కానీ ఎవరు ఎలాంటి జానర్ లో ఏ సినిమా తీస్తారని క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా అభిమానులు వేచి చూడాల్సిందే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి