iDreamPost

బీజేపీ నే కాదు కోమటిరెడ్డి కూడా ఆ ఆరోపణలు చేస్తున్నారు

బీజేపీ నే కాదు కోమటిరెడ్డి కూడా ఆ ఆరోపణలు చేస్తున్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. లక్ష కోట్ల స్కాం చేశారని నిన్నటి వరకు బీజేపీ నేతలు ఆరోపించగా తాజాగా ఆ జాబితాలో కాంగ్రెస్ నేతలు కూడా చేరారు. కేసీఆర్ రూ. లక్ష కోట్ల స్కాం చేశారని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. కొద్ది రోజులుగా కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం కేసీఆర్ అవినీతి బయటపెడతామని చెబుతుండటం దీనికి మరింత బలం చేకూరుస్తోంది

ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా ఖర్చు చేశారు. ఇందులో పర్సంటేజీలు భారీగా చేతులు మారినట్లు ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేశాయి. దీనిపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని కేసీఆర్ చెబుతున్నా ప్రతిపక్షాలు ఆరోపణలు కొనసాగిస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ నే టార్గెట్ చేసుకుంటోంది. ఇందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించి అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తోంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నేతల్లో ఉన్న వైషమ్యాలు పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలని ఆదేశాలు జారీ అయిన సందర్భంలో రాష్ట్రంలో పార్టీని నిలబెట్టి కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ కూడా టీఆర్ఎస్ నే తమ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని పలు సందర్భాల్లో కూడా నేతలు చెబుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికలు మరింత టఫ్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సందర్భంలో టీఆర్ఎస్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారుతోంది పరిస్థితి. దీంతో వచ్చే ఎన్నికలను అంత సులువుగా తీసుకునే పరిస్థితి లేదు. కచ్చితంగా వ్యూహాలు ఖరారు చేసుకుని పార్టీలు బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పతనానికే ఓటు వేస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్ తోడు దొంగలని అభివర్ణిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టి టీఆర్ఎస్ పార్టీ మెడలు వంచుతామని ప్రకటిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా సపోర్టు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద తెలంగాణాలో ఎన్నికల రాజకీయం మొదలైనట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి