iDreamPost

ఎంఐఎం ల‌క్ష్యం ఇదేనా..?

ఎంఐఎం ల‌క్ష్యం ఇదేనా..?

తెలంగాణ‌లో మాత్ర‌మే అధికంగా వినిపించే ఎంఐఎం ప్ర‌స్తావ‌న‌.. ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో అనూహ్యంగా పెరుగుతోంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆలిండియా మజ్లిస్‌-ఎ-ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్‌ నేతలతో హైదరాబాద్‌లో శనివారం భేటీ అయిన ఆ పార్టీ చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఫలవంతమైన చర్చలు జరిగాయంటూ ట్వీట్‌ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడులో కూడా పాగా వేసేందుకు ఎంఎంఐం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ముస్లిం పార్టీలతో పాటు సినీ నటుడు కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీతో జతకట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న వెల్లూర్‌, రాణీపేట్‌, తిరపత్తూర్‌, క్రిష్టగిరి, రామనాథపురం, పుదుకొట్టై, ట్రిచి, ముధురై, తిరునల్వేలి జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ముస్లిం జ‌నాభా ఉన్న చోట క్ర‌మేణా విస్త‌రిస్తూ..

ఏయే రాష్ట్రాల‌లో అయితే ముస్లిం జ‌నాభా ఎక్కువ‌గా ఉందో.. ప్ర‌ధానంగా ఆ రాష్ట్రంలోని ఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి ప్ర‌భావం ఉంటుందో ఆ స్థానాల‌పై ఎంఐఎం దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ఆ నియోజ‌క‌వ‌ర్గాలే ల‌క్ష్యంగా త‌మ బ‌లం పెంచుకుంటూ.. బీజేపీ కి అంత‌టా గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే ఒవైసీ, తమిళనాడు ఆఫీస్‌ బేరర్లతో సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపున​కై అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం తిరుచిరాపల్లి, చైన్నైలో జనవరిలో మరోసారి భేటీ అయి భవిష్యత్‌ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్‌ హాసన్‌ సోమవారం ప్రకటించారు.

అయితే తాము ఏయే నియోజకర్గాల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టతనిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒవైసీ, కమల్‌తో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడటం గమనార్హం. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ముస్లిం జనాభా సుమారు 5. 86 ఉంటుంది. ఇక ఇప్పటికే అక్కడ యూనియన్‌ ముస్లింలీగ్‌, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌, మనితనేయ మక్కల్‌ కట్చి, మనితనేయ జననయాగ కట్చి, ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్‌, తమిళనాడు తోహీద్‌ జమాత్‌ సహా ఇతర రాజకీయ పార్టీలు మైనార్టీల తరఫున గళం వినిపిస్తున్నాయి. వీటిని కలుపుకోవడంతో పాటు మక్కల్‌ నీది మయ్యంతో కూడా పొత్తు పెట్టుకున్నట్లయితే విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశంపై ఒవైసీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి