iDreamPost

కోయంబేడే తమిళనాడు కొంపముంచుతోందా ? ఎంత పెద్దదో తెలుసా ? సూపర్ స్ప్రెడర్

కోయంబేడే తమిళనాడు కొంపముంచుతోందా ? ఎంత పెద్దదో తెలుసా ? సూపర్ స్ప్రెడర్

కరోనా వైరస్ నేపధ్యంలో చెన్నైలోని కోయంబేడు మార్కెట్టే తమిళనాడు కొంపముంచేస్తోందా ? ఇపుడిదే అనుమానం అందరిలోను పెద్దదైపోతోంది. ఒకపుడు చాలా తక్కువగా ఉన్న వైరస్ కేసులు ఇపుడు మొత్తం తమిళనాడును ఒక ఊపు ఊపేస్తోంది. రాష్ట్రమంతా శరవేగంగా విస్తరిస్తోంది. దాంతో ప్రభుత్వంలో టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది. వైరస్ వ్యాప్తిని ఎలా అరికట్టాలో అర్ధంకాక నానా అవస్తలు పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 వేలకుపైగా కేసులు నమోదవ్వటం చాలా ఆందోళనగానే ఉంది ప్రభుత్వానికి.

ఒకపుడు మర్కజ్ మసీదు కేసులు మాత్రమే తమిళనాడులో ఉండేది. మొత్తానికి ఢిల్లీకి ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వాళ్ళని ఎలాగో గుర్తించి అందరినీ క్వారంటైన్ కు పంపింది. దాంతో కేసుల ఉధృతి తగ్గింది. అంటే వైరస్ సమస్య రాష్ట్రంలో నియంత్రణకు వచ్చిందనే అనుకున్నారు. ఇంతలో హఠాత్తుగా కేసుల సంఖ్య పెరగటం మొదలైంది. దాంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. కేసుల సంఖ్య పెరుగుదలకు కోయంబేడే ప్రధాన కారణమని నిర్ధారణ అయ్యింది. అందుకనే మార్కెట్ ను మూసేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మార్కెట్ లోని ఓ హోల్ సేల్ డీలర్ కు వైరస్ ఉన్న కారణంగా హమాలీలు, ఉద్యోగులు అందరికీ వైరస్ సోకిందని గుర్తించారు. ఆ డీలర్ నుండే మిగిలిన వాళ్ళకు కూడా వచ్చింది. దాంతో అది ఒక్కసారిగా అందరికీ వ్యాపించేసింది. ఇంతకీ కోయంబేడు మార్కెట్ ఏమిటి ? ఏమిటంటే చెన్నైలోని కోయంబేడు మార్కెల్ ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్. 1996లో ప్రారంభమైన ఈ మార్కెట్ లో 3750 దుకాణాలున్నాయి. దాదాపు 70 ఎకరాల్లో మార్కెట్ విస్తరించుందంటేనే ఇది ఎంత పెద్ద మార్కెట్టో అర్ధమవుతోంది. చెన్నై చుట్టుపక్కలున్న ప్రాంతాల నుండి కూడా జనాలు ఇక్కడకే వస్తారు.

ఈ మార్కెట్లో ప్రతిరోజు కోట్ట రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఓ అంచనా ప్రకారం మార్కెట్ కు 2.5 లక్షలమంది వస్తారు. ఇన్ని లక్షల మంది వస్తారు కాబట్టే సోషల్ డెస్టెన్సింగ్ సాధ్యంకాదు. మామూలు రోజుల్లోనే ఇంతమంది వస్తే ఇక పండగల సమయాల్లో వచ్చ జనాల సంఖ్య చెప్పటం కష్టమే. అందుకనే ఒక్క డీలర్ కు వైరస్ సోకగానే ఒక్కసారిగా చాలామందికి అంటుకునేసింది. ప్రభుత్వ విచారణలో కోయంబేడు మార్కెట్ నుండే కొన్ని వేలమందికి వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది. అంటే ఉన్న 8 వేల కేసుల్లో సగానికిపైగా ఇక్కడి నుండే స్ప్రెడ్ అయినట్లు అనుమానించారు. అందులోను మొత్తం కేసుల్లో సుమారు 4 వేలు ఒక్క చెన్నైలోనే ఉండటంతో టెన్షన్ పెరిగిపోతోంది.

ఈ మార్కెట్లో సుమారు 10 వేలమంది హమాలీలు పనిచేస్తుంటారు. వీరంతా చెన్నైకి సమీపంలోని 10 ఊర్ల నుండే ప్రతిరోజు వస్తుంటారు. ఉదయం వచ్చి మళ్ళీ రాత్రికి వెళిపోతారు. వీళ్ళ రాకపోకలన్నీ లోకల్ ట్రైన్లలోనే సాగుతుంటాయి. అందుకనే వైరస్ రాష్ట్రవ్యాప్తంగా ఇంత తొందరగా పాకిపోయింది. మొత్తానికి కోయంబేడు మార్కెట్లే తమిళనాడు కొంపముంచేట్లుంది చూస్తుంటే. తమిళనాడు ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తుందో ఏమో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి