iDreamPost

Viral News గేదెతో రిబ్బన్ కటింగ్: కర్ణాటకలో అధికారుల మీద కోపంతో వెరైటీ ప్రారంభోత్సవం

Viral News గేదెతో రిబ్బన్ కటింగ్: కర్ణాటకలో అధికారుల మీద కోపంతో వెరైటీ ప్రారంభోత్సవం

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరిని పిలుస్తారు? రాజకీయ నాయకుడో, సినిమా వాళ్ళనో లేదంటే, తమ స్థాయిని బట్టి లోకల్ లీడర్లనో పిలుచుకుంటారు? కానీ కర్ణాటకలో ఓ ఊరి వాళ్ళు గేదెను ముఖ్య అతిథిగా ఆహ్వానించి కొత్త బస్ షెల్టర్ కి రిబ్బన్ కటింగ్ చేయించారు. ఇంతకీ ఇలా చేసింది కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనా లేక అధికారుల మీద కోపంతోనా అంటే! రెండూ అంటున్నారు వాళ్ళు.

గడగ్ జిల్లా బాలేహోసూర్ వాసులు చాలా ఏళ్ళుగా తమకో బస్ షెల్టర్ కావాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. 40 ఏళ్ళ క్రితం ఇక్కడో బస్ షెల్టర్ నిర్మించారు. కానీ కొన్నేళ్ళకే అది కూలిపోయింది. బస్సు కోసం వెయిట్ చేసేవాళ్ళు అక్కడే ఉన్న హోటల్స్ ముందో, ఇళ్ళు, షాపుల ముందో పడిగాపులు కాచేవాళ్ళు. పని మీద వెళ్ళే వాళ్ళు, స్కూల్స్, కాలేజీలకెళ్ళే వాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇక వర్షాలొస్తే పరిస్థితి మరీ దారుణం. దీంతో గ్రామస్థులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను కలిసి బస్ షెల్టర్ బాగు చేయాలంటూ అర్జీలు పెట్టుకున్నారు. షెల్టర్ బాగుపడింది లేదు కానీ మెల్లగా అక్కడో చెత్త కుండీ తయారైంది. రెండేళ్ళ పాటు నాయకులు, అధికారుల చుట్టూ తిరిగిన గ్రామస్థులు ఇక లాభం లేదనుకుని తామే రంగంలోకి దిగారు. చందాలు వేసుకుని కొబ్బరి మట్టలతో తాత్కాలిక షెల్టర్ కట్టారు. ఓ గేదెతో దీనికి రిబ్బన్ కటింగ్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవడంతో స్థానిక ఎమ్మెల్యే దిగి వచ్చి బాలేహోసూర్ లో బస్ షెల్టర్ నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి