iDreamPost

అటు దిశ, ఇటు వికేంద్రీకరణ.. జగన్‌ బాటలో రాష్ట్రాలు

అటు దిశ, ఇటు వికేంద్రీకరణ.. జగన్‌ బాటలో రాష్ట్రాలు

దేశంలోని పలు రాష్ట్రాలను తన బాటలో నడిచేలా చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూసుకుపోతున్నారు. దేశంలో ఏ నాయకుడూ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని వినూత్న ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్‌ చేస్తున్న కార్యక్రమాలను విపక్షాలు విమర్శిస్తుంటే.. పక్క రాష్ట్రాలు మాత్రం జగన్‌ ముందుచూపును అనుసరిస్తున్నాయి. తాజాగా కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం కూడా పరిపాలన వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించింది. బెంగుళూరు నుంచి తొమ్మిది కీలక కార్యాలయాలను ఇతర ప్రాంతాలను తరలించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియకు ఆ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది.

ఈ విషయంపై ఆ రాష్ట్ర మంత్రి ఒకరు మాట్లాడుతూ.. వెనుకబడిన ఉత్తర కర్ణాటక ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కృష్ణా భాగ్య జల మండలి ఆల్మట్టిలో, దావణగెరెలో కర్ణాటక నీరావరి మండలిని నెలకొల్పుతారు. అలాగే జౌలి అభివృద్ధి మండలి, చక్కెర, చెరుకు అభివృద్ది కార్యాలయాలను బెళగావికి.. ఆర్కియాలజీ, మ్యూజియం, పురావస్తు సంగ్రహణ డైరెక్టర్‌ కార్యాలయాలను హంపిలో ఏర్పాటు చేస్తారు. కర్ణాటక పట్టణ మంచి నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలిని హుబ్లికి తరలిస్తారు.

ఏపీలో పరిపాలన వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న బీజీపీ పార్టీ.. ఇప్పుడు ఏమి సమాధానం చెబుతుందో చూడాలి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ నిర్ణయం.. వైఎస్ జగన్ కు బూస్టింగ్ ఇచ్చింది.

మరోవైపు జార్ఖండ్‌ రాష్ట్రంలోనూ అభివృద్ధి వికేంద్రీకరణ కోసం నాలుగు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆమేరకు కార్యాచరణ కూడా మొదలు పెట్టింది.

మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన దిశ చట్టాన్ని మహారాష్ట్రలో అమలుచేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ఆ రాష్ట్ర హోంమంత్రి దేశ్‌ముఖ్‌తో కూడిన బృందం సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. మహిళలు, బాలికల రక్షణ విషయంలో సీఎం జగన్‌ చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఢిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వం కూడా దిశ చట్టంపై ఆసక్తి కనబరిచింది. చట్టంపై తగిన సూచనలు ఇవ్వాలని గతంలోనే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇలా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆలోచనలను తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాలు చూస్తుంటే ఏపీలో మాత్రం విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి