iDreamPost

క్వారంటైన్ లోకి జమాత్ చీఫ్.. అనుచరులకు కీలక సందేశం

క్వారంటైన్ లోకి జమాత్ చీఫ్.. అనుచరులకు కీలక సందేశం

ఢిల్లీ జమాత్ వల్ల దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ తన అనుచరులకుఈ రోజు ఆడియో సందేశం విడుదల చేశారు. వైద్యుల సలహా మేర తాను క్వారంటైన్ లో ఉన్నానని, కరోనా వైరస్ ప్రబలకుండా నివారించేందుకు వీలుగా తబ్లీగ్ జమాత్ కార్యకర్తలందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని మౌలానా సాద్ విజ్ణప్తి చేశారు. తబ్లీక్ జమాత్ కార్యకర్తలందరూ ఇంటికే పరిమితమై ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని కోరారు.

ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ వద్ద తబ్లిక్ జమాత్ సమావేశాలు నిర్వహించి కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమైన మౌలానా సాద్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు మౌలానా సాద్ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తుండగా, మరోవైపు ఆయన గురువారం జమాత్ కార్యకర్తల కోసం ఆడియో సందేశాన్ని విడుదల చేయడం గమనార్హం.

దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ అయిన ఢిల్లీ మర్కజ్ సమావేశాల్లో 8,500 మందికి పైగా కార్యకర్తలు హాజరయ్యారు. కరోనా ప్రబలకుండా నిజముద్దీన్ ప్రాంతంలోని బంగ్లావాలీ మసీదు, తబ్లిక్ జమాత్ కేంద్ర కార్యాలయమైన మర్కజ్ ను పోలీసులు ఖాళీ చేయించారు. జమాత్ కార్యకర్తలు కొంత మందికి కరోనా లక్షణాలున్నాయని క్వారంటైన్ చేశారు. నిజాముద్దీన్ జమాత్ సమావేశం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెంది కేసుల సంఖ్య పెరిగింది. దీంతోఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పోలీసులు, వైద్యాధికారులు జమాత్ కు వెళ్లిన వారిని గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. పరీక్ష చేసి వైరస్ ఉంటే చికిత్స అందించడం లేదంటే 14 రోజుల క్వారంటైన్ లో ఉంచుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి