iDreamPost

సలార్ కోసం రాబోతున్న మల్లీశ్వరి ?

సలార్ కోసం రాబోతున్న మల్లీశ్వరి ?

ఎప్పుడో 2004లో వచ్చిన వెంకటేష్ మల్లీశ్వరి సినిమా అంటే అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులు సైతం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఫీలయ్యే క్లీన్ ఎంటర్ టైనర్. అందులో టైటిల్ రోల్ పోషించిన కత్రినా కైఫ్ ని మర్చిపోగలమా. ఆ తర్వాత 2005లో బాలకృష్ణతో అల్లరి పిడుగు చేసినప్పటికీ అది దారుణంగా డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఇటువైపు చూడలేదు. టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెళ్లినా కూడా బాలీవుడ్ లో యమా బిజీ కావడంతో ఇక్కడి స్టార్ల సరసన నటించే అవకాశాలు కోల్పోయింది. ఇదంతా జరిగి 17 ఏళ్ళు దాటింది. తనకు ఇప్పటికీ అక్కడ ఆఫర్లకు కొదవ లేదు. ఇంత సీనియారిటీలోనూ ఛాన్సులు కొట్టేస్తోంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం కత్రినా కైఫ్ మరోసారి తెలుగు ప్రేక్షకుల కోసం రాబోతోంది. డార్లింగ్ ప్రభాస్ సరసన సలార్ లో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ లో నటించేందుకు తన ముందు ప్రతిపాదన ఉంచారట. కత్రినాకు ఇలాంటి పాటలు కొత్త కాదు. తీస్మార్ ఖాన్ లాంటి ఫ్లాప్ కూడా అంతో ఇంతో జనంలోకి వెళ్లిందంటే దానికి కారణం ఆమె నర్తించిన పాటలే. హృతిక్ రోషన్ అగ్ని పథ్ లోనూ తన సాంగే ప్రధాన హై లైట్. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకే సలార్ లాంటి పాన్ ఇండియా సినిమా కాబట్టి కత్రినా ఉంటే చాలా ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ ఆలోచన చేసినట్టు ఉన్నారు

సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ కాగా నిన్నటి నుంచి రెండో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఇవాళ ప్రభాస్ కూడా జాయిన్ కాబోతున్నాడు. రాధే శ్యామ్ కు సంబందించిన పనులు తనవరకు అన్నీ పూర్తవ్వడంతో ఇప్పుడు తన పూర్తి ఫోకస్ సలార్ తో పాటు అది పురుష్ మీద పెట్టబోతున్నాడు. ఇటీవలే మొదలైన ప్రాజెక్ట్ కె ఎప్పుడు రెగ్యులర్ షూట్ కి వెళ్తుందో ఇంకా క్లారిటీ రాలేదు. రాధే శ్యామ్ 2022 జనవరికి ఫిక్స్ అయ్యింది కాబట్టి సలార్ ముందు చెప్పినట్టు తక్కువ గ్యాప్ తో ఏప్రిల్ లోనే వస్తుందా లేక ఏదైనా మార్పు ఉంటుందా వేచి చూడాలి. రాబోయే మూడేళ్ళలోపే ప్రభాస్ నాలుగు సినిమా విడుదలలు ఫిక్స్ అయ్యాయి

Also Read : మెగా మూవీ వచ్చేది ఎప్పుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి