iDreamPost

చంద్రబాబు అడుగుజాడల్లోనే సిపిఐ నడుస్తోందా ?

చంద్రబాబు అడుగుజాడల్లోనే సిపిఐ నడుస్తోందా ?

చంద్రబాబునాయుడు ఏమి చెబితే అది, టిడిపి ఏమి చేస్తే దాన్నే సిపిఐ కూడా ఫాలో అయిపోతోంది. టిడిపి డిమాండ్లు, నిరసనలు సిపిఐ డిమాండ్లు, నిరసనలు దాదాపు కట్ అండ్ పేస్ట్ లాగే ఉంటోంది. పేదలకు ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసి అటువంటి మరికొన్ని డిమాండ్లతో తమ నేతలను ఇళ్ళల్లో కూర్చుని దీక్షలు చేయమన్నాడు. ఇపుడు అటువంటి డిమాండ్లే సిపిఐ రామకృష్ణ కూడా చేసి తమ నేతలను దీక్షల్లోకి దింపాడు.

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే టిడిపి తరువాత దీక్షలకు దిగారు కాబట్టి తమ్ముళ్ళ డిమాండ్లకు మరికొన్ని జతచేశారంతే. ఎలాగూ రాష్ట్రంలో సిపిఐ అధికారంలోకి వచ్చేది లేది పెట్టేది లేదు. కాబట్టి ఎటువంటి డిమాండ్లు చేసినా తమకు పోయేది ఏమీ లేదన్నది రామకృష్ణ భావనగా ఉంది చూస్తుంటే. అందుకనే గొంతెమ్మ కోరికలు చాలానే విప్పేశాడు. కరోనా వైరస్ సంక్షొభంలో పేద, అసంఘిటిత కార్మికులకు, భవన నిర్మాణ చేనేత రంగాల్లోకి కార్మికులకు వెంటనే రూ 5 వేలు చెల్లించాలట.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న సాయం ఏమాత్రం సరిపోదంటున్నారు సిపిఐ నేతలు. ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యంతో పాటు ఇతర అవసరాలకు నెలకు 5 వేల రూపాయలు వెంటనే ఇచ్చేయాలట. రైతులకు వ్యవసాయ రుణమాఫీ చేయాలట. అలాగే అసంఘటిత రంగంలోని కార్మికులకు పది వేల రూపాయలు అందించాలట. చిరు వ్యాపారులకు బ్యాంకు రుణాలు రద్దు చేయటంతో పాటు మళ్ళీ వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడి సాయం చేయాలట.

ఇటువంటి డిమాండ్లు సిపిఐ చాలానే చేసింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఏమిటి ? తమ డిమాండ్లు తీరాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి ? అనే సోయ కూడా లేదు సిపిఐ నేతల్లో. ఎటూ తాము అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి గుడ్డ కాల్చి జగన్మోహన్ రెడ్డి మొహం మీద వేసేస్తే తుడుచుకుంటుండులే అనే దుర్మార్గపు ఆలోచనే కనబడుతోంది వీళ్ళ డిమాండ్లలో. మొత్తం మీద జనాల కోసం కాకుండా కేవలం చంద్రబాబు కోసమే తాము పనిచేస్తున్నట్లు రామకృష్ణ మరోసారి నిరూపించుకున్నాడు. బిజెపి నేతలు దీక్షలకు దిగాలంటే జాతీయ పార్టీ అనుమతి కావాలి. మరి జనసేన నేతలు ఎప్పుడు దీక్షలకు దిగుతారో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి