iDreamPost

IND vs ENG: మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ చిత్తు! భారత విజయానికి 5 కారణాలు

  • Published Feb 18, 2024 | 5:15 PMUpdated Feb 18, 2024 | 5:17 PM

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి.. 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వచ్చింది. మరి ఈ విజయానికి ఐదు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం..

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి.. 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వచ్చింది. మరి ఈ విజయానికి ఐదు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం..

  • Published Feb 18, 2024 | 5:15 PMUpdated Feb 18, 2024 | 5:17 PM
IND vs ENG: మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ చిత్తు! భారత విజయానికి 5 కారణాలు

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నెల 15న ప్రారంభమైన మ్యాచ్‌ను అద్భుత ప్రదర్శనతో నాలుగో రోజే ముగించింది. ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో ఇండియా ఈ మ్యాచ్‌ గెలిచింది. రోహిత్‌ శర్మ, జడేజా సెంచరీలు, జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ, సర్ఫరాజ్‌ ఖాన్‌ రెండు హాఫ్‌ సెంచరీలతో పాటు, జడేజా, సిరాజ్‌, బుమ్రా, కుల్దీప్‌, అశ్విన్‌ సూపర్‌ బౌలింగ్‌తో టీమిండియా ఈ మ్యాచ్‌ను గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌ అయిన ఇండియా, ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌట్‌ చేసింది. 126 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టి 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి.. ఇంగ్లండ్‌ ముందు 557 టార్గెట్‌ను ఉంచింది. ఈ భారీ టార్గెట్‌ ఛేదించే క్రమంలో.. ఇంగ్లండ్‌ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది.  ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో టీమిండియా ముందంజలోకి వచ్చింది. మరి ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచి ఓ 5 అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. రోహిత్‌-జడేజా పార్ట్నర్‌షిప్‌
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియాకు ఇంగ్లండ్‌ షాకిచ్చింది. 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి.. భారత జట్టును కష్టాల్లోకి నెట్టింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌, రజత్‌ పాటిదార్‌ వెంటవెంటనే అవుట్‌ అవ్వడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ, ఇక్కడి నుంచి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ-రవీంద్ర జడేజాతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేసి.. టీమ్‌ను గట్టెక్కించారు. 200 పైచిలుకు పార్ట్నర్‌షిప్‌ నమోదు చేయడంతో పాటు.. రోహిత్‌ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 131 పరుగులతో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. జడేజా సైతం సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యమే ఈ మ్యాచ్‌లో టీమిండియాను నిలబెట్టింది.

2. బౌలింగ్‌
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి రెండో ప్రధాన కారణంగా నిలిచింది బౌలింగ్‌. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఎటాకింగ్‌ గేమ్‌తో భారత బౌలర్లను ఎటాక్‌ చేసింది. బెన్‌ డకెల్‌ వన్డే తరహా బ్యాటింగ్‌ చేస్తూ.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసి.. గట్టి పోటీ ఇచ్చింది. కానీ, మూడో రోజు భారత బౌలర్లు చెలరేగి బౌలింగ్‌ చేసి.. ఇంగ్లండ్‌ 319 పరుగులకే కట్టడి చేశారు. సిరాజ్‌ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక 557 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను జడేజా ఒక ఆట ఆడుకున్నాడు. ఏకంగా 5 వికెట్లతో చెలరేగి తన స్పిన్‌ మ్యాజిక్‌తో ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. 557 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను కేవలం 122 పరుగులకే కుప్పకూల్చి.. 434 పరుగుల భారీ తేడాతో భారత్‌కు విజయం అందించారు బౌలర్లు.

3. ఫీల్డింగ్‌
ఈ మ్యాచ్‌లో టీమిండియాకు బాగా ప్లస్‌ అయిన విషయం ఫీల్డింగ్‌. మంచి క్యాచ్‌లు అందుకోవడం, అలాగే పరుగులను అడ్డుకోవడంలో మన ఫీల్డర్లు అద్భుతంగా రాణించారు. అలాగే రనౌట్‌లు కూడా చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్‌, జురెల్‌ బెన్‌ డకెట్‌ను అవుట్‌ చేసిన విధానం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇలా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్‌కు కూడా ఈ విజయంలో కొంత భాగం ఇవ్వక తప్పదు. పైగా స్లిప్స్‌లో జైస్వాల్‌, రోహిత్‌ అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నారు. బౌండరీ లైన్స్‌ వద్ద మన ఫీల్డింగ్‌ ఎంతో మెరుగైంది.

4. రోహిత్‌ కెప్టెన్సీ
బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో టీమిండియా ఇంత అద్భుత ప్రదర్శన కనబర్చడానికి ప్రధాన కారణం.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ. ఇక కెప్టెన్‌గా మంచి ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంచుకున్న రోహిత్‌.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో, బౌలింగ్‌ మార్పుల్లో, ఫీల్డింగ్‌ సెట్‌లో తన మార్క్‌ చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 33 రన్స్‌కే 3 వికెట్లు పడిన సమయంలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ను కాకుండా జడేజాను ముందుగా బ్యాటింగ్‌కు దింపాడు. అది మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. అలాగే.. దాంతో పాటు బౌలింగ్‌ మార్పులు కూడా అద్భుతంగా చేశారు. అశ్విన్‌ లేకపోయినా.. మూడో రోజు ఆటలో కేవలం నలుగురు బౌలర్లను మార్చి మార్చి బాగా ప్రయోగించాడు. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫీల్డింగ్‌ అద్భుతంగా సెట్‌ చేశాడు. అందుకే ఈ విజయంలో రోహిత్‌ కెప్టెన్సీకి వందకు వంద మార్కులు ఇవ్వాల్సిందే.

5. జైస్వాల్‌, సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌
ఇక ఆఖరిగా చెప్పుకోవాల్సింది.. యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ బ్యాటింగ్‌ గురించి. తొలి మ్యాచ్‌ ఆడుతున్నా కూడా సర్ఫరాజ్‌ మంచి ఇంటెంట్‌ చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌ 66 బంతుల్లో 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లోనూ 68 పరుగులతో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక జైస్వాల్‌ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడి డబుల్‌ సెంచరీ బాదాడు. జైస్వాల్‌ ఆడిన ఇన్నింగ్స్‌ ఇంగ్లండ్‌ ముందు టీమిండియా భారీ స్కోర్‌ను పెట్టేందుకు ఉపయోగపడింది. రోహిత్‌ శర్మ విఫలమైనా.. జైస్వాల్‌ ఒక ఎండ్‌లో పాతుకుపోయాడు. ఇంగ్లండ్‌పై ఎటాకింగ్‌ గేమ్‌ ఆడుతూ.. వాళ్లను డిఫెన్స్‌లో పడేశాడు. ఒక రకంగా చెప్పాలంటే.. జైస్వాల్‌ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ కాన్ఫిడెన్స్‌ చచ్చిపోయింది. మరి ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించడానికి కారణమైన ఈ 5 అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి