iDreamPost

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఇండియాకి ‘గౌరవ సభ్య దేశం’ హోదా.. భారతదేశంలో సినిమాలు తీయండి అంటూ మోదీ ప్రత్యేక లేఖ..

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఇండియాకి ‘గౌరవ సభ్య దేశం’ హోదా.. భారతదేశంలో సినిమాలు తీయండి అంటూ మోదీ ప్రత్యేక లేఖ..

ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మన దేశానికి చెందిన పలువురు నటీ నటులు పాల్గొన్నారు. మన సినిమాలని కొన్ని ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. అంతే కాక కేన్స్ చిత్రోత్సవాల్లో ఇండియాకి ‘గౌరవ సభ్య దేశం’ హోదాని ఇచ్చారు. దీంతో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ కూడా ఈ ఫిలిం ఫెస్టివల్ లో అధికారికంగా పాల్గొన్నారు. ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత దేశానికి ఈ హోదా ఇవ్వడంతో ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ తన ఓ లేఖ రాశారు.

మోదీ రిలీజ్ చేసిన ఈ లేఖలో భారతీయ సినిమాల గొప్పతనం గురించి, ఇక్కడ సినిమాల చిత్రీకరణకు ఎంత అనుకూలంగా ఉంటుందో తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలని భారతదేశం నిర్మిస్తుందని, బయటి దేశాల నిర్మాతలకు కూడా ఇక్కడ సినిమా నిర్మాణ రంగంలో సులభతర వాణిజ్య విధానాన్ని అమలు పరుస్తున్నామని, నైపుణ్యం ఉన్న టెక్నీషియన్స్, ఎన్నో ప్రకృతి అందాలు భారతదేశంలో ఉన్నాయని, అవి ప్రపంచ దర్శక నిర్మాతలకు నచ్చుతాయని తెలుపుతూ భారతదేశానికి వచ్చి సినిమాలు తీయండి అంటూ ఆహ్వానం పంపారు.

ఇక సత్యజిత్ రే శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేన్స్ క్లాసిక్‌ చిత్ర ప్రదర్శనలో సత్యజిత్‌ రే సినిమాలను ప్రదర్శించడం పట్ల మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దర్శక, నిర్మాతలు భారతదేశంలో సినిమాలు నిర్మించాలని ఈ లేఖ ద్వారా మోదీ కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి