iDreamPost

కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్‌!

కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్‌!

ఒక్కరోజులో 7466 పాజిటివ్ కేసుల నమోదు

దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.  గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 7466 కేసులు, 175 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 4706కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా వైరస్‌ బయటపడ్డ తరువాత  24గంటల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ బారినుండి 71105 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 89987 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కాగా కరోనా మరణాల్లో భారత్‌, చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటివరకు 4634 కొవిడ్‌ మరణాలు సంభవించగా భారత్‌లో ఈ సంఖ్య 4706గా నమోదయింది. అయితే చైనా కరోనా మరణాల సంఖ్యపై ప్రపంచ వ్యాప్తంగా సందిగ్దత నెలకొన్న విషయం తెలిసిందే. చైనా మరణాల సంఖ్యను దాచి పెట్టిందన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ప్రపంచంలో భారత్‌ 9వ స్థానానికి ఎగబాకింది. లక్షా 82వేల కేసులతో జర్మనీ 8వ స్థానంలో ఉండగా, లక్షా 60వేల కేసులతో టర్కీ 10స్థానంలో కొనసాగుతోంది.

మహారాష్ట్రలో 2598 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు.గత కొద్దిరోజులుగా రోజుకు రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2598 పాజిటివ్ కేసులు నమోదవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతుంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 59546 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 1982 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 35,485 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 35,485 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా 117 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 2256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 844 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1345 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 67 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 128 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 3245 కి మందికి కరోనా సోకగా 59 మంది మృత్యువాత పడ్డారు.2133 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1053 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 5,909,003 మందికి కోవిడ్ 19 సోకగా 362,081 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 2,581,951 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,768,461 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 103,330 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి