iDreamPost

టీడీపీ మోకాల‌డ్డుపై పెరుగుతున్న నిర‌స‌న సెగ

టీడీపీ మోకాల‌డ్డుపై పెరుగుతున్న నిర‌స‌న సెగ

ఏపీ సీఎం వైఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జెట్ స్పీడులో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్ర‌జ‌ల‌లో తిరుగులేని నాయ‌కుడిగా గుర్తింపు పొందుతున్నారు. ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ ఏం చేయాలో పాలుపోక‌.. కొన్ని ప‌థ‌కాలు అమ‌లు కాకుండా మోకాల‌డ్డుతోంది. కోర్టు కేసుల ద్వారా వాయిదాలు ప‌డేలా చేస్తోంది. దేవుడు వ‌ర‌మిచ్చినా సైతాన్ అడ్డుత‌గులుతుంద‌న్న‌చందంగా జ‌గ‌న్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. చంద్ర‌బాబు అడ్డు త‌గులుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వేచి చూసిన ల‌బ్దిదారులు టీడీపీ చ‌ర్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇళ్ల స్థ‌లాల పంపిణీకి టీడీపీ నేత‌లు అడ్డుప‌డుతున్నార‌న్న విష‌యాన్ని గ్ర‌హిస్తున్న ల‌బ్దిదారులు ఆందోళ‌న బాట ప‌డుతున్నారు. గ‌తంలో నిర‌స‌న సెగ‌కు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గుర‌య్యారు. ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కూడా నిర‌స‌న సెగ త‌ప్పేలా లేదు.

ఇప్ప‌టికీ – ఇప్ప‌టికీ ఎంతో తేడా

తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల కాలం మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం బడ్జెట్‌లో కేటాయించింది రూ.57 వేల కోట్లు అయితే, ఖర్చు చేసింది కేవలం రూ.44వేల కోట్లు మాత్రమే అన్న‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల్లోనే వైఎస్‌ జగన్ సీఎంగా ఆ వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ. 59, 425 కోట్లు ఖర్చు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు రూ.60 వేల కోట్లు నేరుగా వారి ఖాతాలకే జమ చేస్తుంటే… టీడీపీ నేతలు సిగ్గు లేకుండా అడ్డు ప‌డుతున్నార‌ని కొంద‌రు మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలు కోసం ఏ ఒక్కరి పార్టీ, కులం, మతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా జ‌గ‌న్ అంద‌రికీ మేలు చేస్తూ వెళ్తున్నారు. చంద్రబాబు తన హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా తమ పార్టీ వారికే ప్రభుత్వ పథకాలను అందించార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

మీరు ఇవ్వ‌లేదు.. ఇచ్చేవార‌ని అడ్డుకుంటారా..?

ఏపీలో ఇల్లు లేని, దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు తెల్ల కార్డే అర్హతగా ఎంపిక చేసిన సుమారు 30 లక్షల మందికి నివాస స్థలాలను విక్రయ దస్తావేజుల (కన్వేయన్స్‌ డీడ్ల) రూపంలో రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ల‌బ్దిదారుల‌కు అంద‌జేసేందుకు సిద్ధంగా కూడా ఉన్నారు. కానీ రాజ‌కీయ స్వ‌లాభంతో పేద‌ల క‌ల నెర‌వేర‌కుండా ర‌క‌ర‌కాల కార‌ణాల‌ను సాకుగా చూపి కోర్టు కేసుల ద్వారా అడ్డుప‌డుతోంది ప్ర‌తిప‌క్ష టీడీపీ. ఈ విష‌యంలో గ‌తంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కి నిరస‌న సెగ త‌గిలింది. టీడీపీ హయాంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ జరిపి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టడంతో తామంతా సంతోషంగా ఉన్నామ‌ని, అడ్డుకుంటే ఊరుకునేది లేద‌ని ఆయ‌న ఇంటికి వెళ్లి మ‌రీ హెచ్చ‌రించారు.

చంద్ర‌బాబును వెలివేయాలి : ఇద్వా

సంక్షేమ ప‌థ‌కాలు అడ్డుకోవ‌డంపై చంద్ర‌బాబునాయుడుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ఇద్వా(ఐడియల్‌ దళిత్‌ ఉమెన్‌ అసోసియేషన్‌). కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి హైదరాబాద్‌కు పారిపోయిన చంద్రబాబును రాష్ట్రం నుంచి వెలివేయాలని, రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకానికి కోర్టుల ద్వారా అడ్డు తగులుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి అడ్డు తగులుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా గుంటూరు లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా శంకర్‌విలాస్‌ సెంటర్‌లో ‘రాష్ట్ర అభివృద్ధి నిరోధక వైరస్‌ చంద్రబాబు’ అంటూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ దళిత, బహుజనుల అభివృద్ధికి బాసటగా నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కంభం ఆనందకుమార్, క్రైస్తవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మద్దు ప్రేమజ్యోతిబాబు మాట్లాడుతూ..ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ భూస్వాముల దాడులు హేయమన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి