iDreamPost

‘మార్క్ ఆంటోనీ’ సెన్సార్ కోసం లంచం.. హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు

‘మార్క్ ఆంటోనీ’ సెన్సార్ కోసం లంచం.. హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో అవినీతి భూతం దావానంలా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు లంచాలు తీసుకోవడం వంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. చేతులు తడపనిదే ఏ పని చేయకుండా ప్రజల రక్తాన్ని తాగే అధికారులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లంచం వ్యవహారం సినిమా ఇండస్ట్రీని తాకింది. ఓ హీరో తన సినిమా సెన్సార్ కోసం లక్షల్లో లంచం చెల్లించుకోవాల్సి వచ్చింది. తను లంచం చెల్లించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు ఆ హీరో. దీంతో ఈ లంచం వ్యవహారం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్లాప్స్ హిట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. సినిమాలే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటారు విశాల్. ఇండస్ట్రీ పరంగా కానీ, సొసైటీలో అయినా ఏదైనా సమస్య వస్తే స్పందించి తన గళాన్ని వినిపిస్తాడు. ఏ విషయాన్నైనా డొంకతిరుగుడు లేకుండా ముక్కు సూటిగా చెప్పే తత్వం హీరో విశాల్ సొంతం. ఈ క్రమంలోనే ఇటీవల తను నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం సెన్సార్ కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. సెన్సార్ అధికారులు తన నుంచి లంచం తీసుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన విశాల్.. అవినీతిని సినిమాల్లో చూపిస్తున్నారు, కానీ నిజ జీవితంలో ఇలా జరగడాన్ని నేను జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపాడు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ ముంబై కార్యాలయంలో దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ కోసం 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని ఆరోపించాడు. మొత్తం 2 లావాదేవీలుగా స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు లంచం ఇచ్చినట్లు వెల్లడించాడు.

నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. ఈ రోజు విడుదలైన సినిమా నుండి చాలా ఎక్కువ వాటా నాపేరున ఉన్నందున సంబంధిత మధ్యవర్తికి డబ్బు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయాన్ని గౌరవ మహారాష్ట్ర సీఎం మరియు నా గౌరవప్రదమైన పీఎం మోడీ దృష్టికి తీసుకు వెళ్తున్నాను. ఇలా చేయడం నా కోసం కాదు సినిమాలు చేయబోతున్న నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి దారపోయను. అందరికీ తెలిసేందుకే సాక్ష్యం కూడా ఇస్తున్నా.. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నాను అని హీరో విశాల్ ట్వీట్ చేసారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి