iDreamPost

విజయవాడ–నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకి గ్రీన్ సిగ్నల్..

విజయవాడ–నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకి గ్రీన్ సిగ్నల్..

విజయవాడ నుంచి నాగ్ పూర్ కు వెళ్లాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ టు ఆదిలాబాద్ మీదుగా దాదాపు 770 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి 13 గంటల సమయం పడుతుంది. ఇంత సమయం, ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఎవరికైనా ఇబ్బందే. కానీ త్వరలోనే ఈ సమస్యకు చెక్ పడబోతోంది. కొత్త ఎక్స్‌ప్రెస్‌ హైవేను విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, మంచిర్యాల మీదుగా నిర్మించన్నారు. దీంతో 163 కిలోమీటర్లు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

విజయవాడ–నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 14 వేల కోట్లు వెచ్చింది.. 457 కిలోమీటర్ల రోడ్డు నిర్మించే ప్రణాళికను NHI ఆమోదించింది. ఈమేరకు ఫీజబులిటీ నివేదిక, డీపీఆర్‌లను ఖరారు చేసింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవేను ఐదు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. విజయవాడ – ఖమ్మం, ఖమ్మం – వరంగల్, వరంగల్‌ – మంచిర్యాల ప్యాకేజీలను గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలుగా, మంచిర్యాల – రేపల్లెవాడ, రేపల్లెవాడ – చంద్రాపూర్‌ ప్యాకేజీలను బ్రౌన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలుగా నిర్మించాలని తలపెట్టింది.

ఈ హైవేను చంద్రాపూర్‌ నుంచి నాగ్‌పూర్‌కు ఇప్పటికే ఉన్న 4 లేన్ల ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారికి అనుసంధానిస్తారు. ఇప్పటికే డీపీఆర్ సిద్ధం కావడంతో భూసేకరణపై దృష్టి సారించారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలతో NHAI సంప్రదింపులు జరుపుతోంది. దాదాపు ఈ హైవే నిర్మాణానికి 1.65 లక్షల చదరపు మీటర్ల భూమి అవసవరం పడుతుందని అంచనా వేస్తున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే 2025 నాటికి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి