iDreamPost

కమల వికాసం.. అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ..

కమల వికాసం.. అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలను సాధిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు వచ్చిన ఫలితాలను బట్టీ ఆ పార్టీ 25 లోపు స్థానాలను గెలుచుకుంటుందని అందరూ అంచనా వేశారు. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే కొద్దీ బీజేపీ గెలుపొందే స్థానాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆధిక్యంలో నిలిచే స్థానాలు పెరిగాయి.

సాయంత్రం ఆరు గంటల సమయానికి 150 డివిజన్లకు గాను 122 డివిజన్లలో ఫలితాలు వెళ్లడయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీ 47 డివిజన్లలో గెలుపొందగా మరో 11 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అదే సమయంలో బీజేపీ 33 డివిజన్లలో విజయం సాధించి.. మరో 12 డివిజన్లలో ఆధిక్యంలో నిలిచింది. ఎంఐఎం ఇప్పటి వరకు 40 డివిజన్లలో గెలుపొందగా.. మరో మూడు డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు చోట్ల విజయం సాధించింది. మరోక డివిజన్‌లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న స్థానాలను ఆయా పార్టీలు గెలిస్తే.. టీఆర్‌ఎస్‌ గెలిచే మొత్తం సీట్ల సంఖ్య 58, బీజేపీ 45, ఎంఐఎం 43, కాంగ్రెస్‌ 3గా ఉంటుంది. ఇవే తుది ఫలితాలు అయితే.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఒంటరిగా మేయర్‌ పీఠాన్ని సాధించడం అసాధ్యమవుతుంది. ఎక్స్‌ అఫిషియో సభ్యులు 31 మందితో కలిసి ఆ పార్టీ మేయర్‌ పీఠం సాధించాలంటే 67 మంది కార్పొరేటర్లు గెలవాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి