iDreamPost

వివాదాస్పదంగా మారిన హర్మన్‌ప్రీత్‌ ప్రవర్తన! ఇలా చేయడం కరెక్టేనా?

  • Published Jul 24, 2023 | 11:34 AMUpdated Jul 24, 2023 | 11:34 AM
  • Published Jul 24, 2023 | 11:34 AMUpdated Jul 24, 2023 | 11:34 AM
వివాదాస్పదంగా మారిన హర్మన్‌ప్రీత్‌ ప్రవర్తన! ఇలా చేయడం కరెక్టేనా?

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా జరిగిన చివరి వన్డేలో బ్యాట్‌తో వికెట్లను కొట్టడం, అంపైర్‌ను దూషించడం, బంగ్లాదేశ్‌ టీమ్‌ను అవమానించేలా మాట్లాడటం వంటి విషయాల్లో హర్మన్‌ప్రీత్‌ లైన్‌ దాటి ప్రవర్తించిందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది హర్మన్‌ చేసిన పనిని సమర్ధిస్తుంటే.. మరికొంతమంది తప్పుబడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో చాలా డిటేయిల్డ్‌గా తెలుసుకుందాం..

మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లిన ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌.. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌ గెలిచిన ఉత్సాహంలో బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ను సైతం గెలిచింది. దీంతో వన్డే సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడింది. కానీ రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. దీంతో చివరిదైన మూడో వన్డే ఎంతో కీలకంగా మారింది. సిరీస్‌ డిసైడర్‌గా మారిన మూడో వన్డేలో గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ.. విజయం వరించలేదు. చివరి మ్యాచ​ టైగా ముగియడంతో ఇరు జట్లను సిరీస్‌ ఉమ్మడి విజేతగా ప్రకటించారు. సాధారణంగా అయితే.. స్టోరీ ఇలానే ఎండ్‌ కావాల్సింది.

కానీ, చివరి వన్డే సందర్భంగా అంపైర్‌ తప్పిదాలే వివాదానికి దారి తీసింది. బంగ్లా నిర్దేశించిన 226 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్‌ స్మృతి మంధాన హాఫ్‌ సంచరీతో రాణించింది. ఈ టార్గెట్‌ టీమిండియా సులువుగా ఛేదిస్తుందనుకున్న క్రమంలో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఎల్బీడబ్ల్యూగా అవుటైంది. కానీ, ఆమె అంపైర్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. పెవిలియన్‌కు వెళ్తూ అంపైర్‌ను తిడుతూ వెళ్లింది. ఇక్కడితో హర్మన్‌ శాంతించలేదు.

మ్యాచ్‌ ముగిసిపోయాకా.. ట్రోఫీ ప్రజంటేషన్‌ సమయంలో ఇద్దరు కెప్టెన్లు ట్రోఫీ అందుకుంటున్న సమయంలో అంపైర్లను సైతం పిలవాలని కోరింది. అలాగే విన్నర్‌ బోర్డు వద్ద ఫొటో షూట్‌ కోసం వెళ్లినప్పుడు బంగ్లాదేశ్‌ టీమ్‌ను అవమానించేలా మాట్లాడింది. ఫొటో షూట్‌కు మీరు మాత్రమే వచ్చారేంటి అంపైర్లను కూడా పిలవాల్సింది. మీరు సిరీస్‌ను టై చేయలేదు. అంపైర్ల వల్ల మ్యాచ్‌ టై అయింది. కనీసం వారితో ఫొటో దిగినా బాగుంటుంది అంటూ బంగ్లాదేశ్‌ ప్లేయర్లతో చెప్పింది. ఆ మాటలకు బంగ్లా కెప్టెన్‌ ఆగ్రహించి, ఫొటో షూట్‌ నుంచి మధ్యలోనే జట్టుతో పాటు వెళ్లిపోయింది. దీంతో హర్మన్‌ ప్రీత్‌ తీరుపై విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో హర్మన్‌ ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టెస్టుల్లో తొలి హాఫ్‌ సెంచరీ చేసిన ఇషాన్‌ కిషన్‌.. పంత్‌కు థ్యాంక్స్ చెబుతూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి